సారపాక/ మణుగూరు టౌన్/ బూర్గంపహాడ్, సెప్టెంబర్ 11: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పదేళ్ల కాలంలోనే తెలంగాణలో అద్భుత అభివృద్ధి జరిగిందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. భద్రాద్రి జిల్లాలో లక్షన్నర ఎకరాల పోడు భూములకు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని స్పష్టం చేశారు. మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తొలుత విప్ మాట్లాడుతూ.. తాను అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసి నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతగానో సహకరించారని అన్నారు. హైదరాబాద్లో అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని, ఈ మేరకు మణుగూరులో కూడా అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు ఏర్పాటు చేసేందుకు నిధులు కేటాయించారని, అందులో భాగంగా సోమవారం మూడు ఆత్మగౌరవ భవనాలకు శంకుస్థాపనలు చేశామని వివరించారు. ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ. రూ.వందల కోట్ల నిధులతో పినపాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన రేగా.. ముఖ్యమంత్రికి అత్యంత ప్రీతిపాత్రుడని అన్నారు. మణుగూరులో పవర్ప్లాంట్ నిర్మించి ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి కల్పించిన ఘనత సీఎం కేసీఆర్దేనని స్పష్టం చేశారు.
రూ.2 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
మణుగూరు మండలంలో గుట్ట మల్లారం, లంక మల్లారం, ఉడతనేని గుంపు గ్రామాల్లో ఎస్సీ సంఘం, కమ్మ సంఘం, పెరిక సంఘం కమ్యూనిటీ హాళ్ల కోసం రూ.2 కోట్లతో సింగరేణి సీఎస్ఆర్, ఎస్డీఎఫ్ నిధులతో చేపట్టిన నిర్మాణాలకు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాతా మధు కలిసి సోమవారం శంకుస్థాపనలు చేశారు. కాగా, లంక మల్లారంలో కమ్మ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం స్థలాన్ని అందించిన స్థలదాత పోశం పుల్లయ్య, ధనమ్మ దంపతులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ సన్మానించారు. అలాగే వివిధ గ్రామాల్లో ఆయా సంఘాల బాధ్యులు కూడా విప్ రేగా, ఎమ్మెల్సీ మధు, బీఆర్ఎస్ భద్రాచలం నియోజవకర్గ అభ్యర్థి తెల్లం వెంకట్రావులను సత్కరించారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు కంచర్ల చంద్రశేఖరరావు, పోశం నర్సింహారావు, కుర్రి నాగేశ్వరరావు, ముత్యం బాబు, అడపా అప్పారావు, బొలిశెట్టి నవీన్, రామిడి రామిరెడ్డి, వట్టం రాంబాబు, తాళ్లపల్లి యాదగిరిగౌడ్, జావేద్పాషా, గుడిపూడి కోటేశ్వరరావు, నవీన్బాబు, బిక్కసాని శ్రీనివాసరావు, వల్లూరిపల్లి వంశీకృష్ణ పాల్గొన్నారు.
కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి చేరికలు
బూర్గంపహాడ్ మండలం పినపాక పట్టీనగర్లోని కాంగ్రెస్కు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, ఇతర పార్టీల వారు మణుగూరులోని క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ రేగా, ఎమ్మెల్సీ మధు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు కామిరెడ్డి శ్రీలత, బిక్కసాని శ్రీనివాసరావు, గోపిరెడ్డి రమణారెడ్డి, వంశీకృష్ణ, భూక్యా పరమేశ్వరి పాల్గొన్నారు.