ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. గురువారం హైదరాబాద్లోని ఆమె ఇంటికి వెళ్లి ఘటన జరిగిన తీరుపై విచారం వ్యక్తం చేశారు. కాషాయ నేతలు రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నారని, కవితపై ఆరోపణలు సరికాదని, బీజేపీ నేతల కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
– ఖమ్మం, ఆగస్టు 25
శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఇంటిపై బీజేపీ నాయకుల దాడి హేయమైన చర్య అని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం అన్నారు. టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ఇతర డీసీసీబీ చైర్మన్లతో కలిసి గురువారం హైదరాబాద్ వెళ్లిన ఆయన.. అక్కడ ఎమ్మెల్సీ కవితను ఆమె నివాసంలో కలిసి దాడి వివరాలను తెలుసుకున్నారు. రాష్టంలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బీజేపీ నేతలకు ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారని అన్నారు. కవితపై అవాస్తవాలను ప్రచారం చేయడంతోపాటు ఏకంగా ఆమె ఇంటిపై దాడి చేయడం సరికాదని అన్నారు.