భద్రాచలం, జూన్ 26: గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో తరగతులు ప్రారంభమైనందున విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర గురుకులాల ప్రిన్సిపల్ సెక్రటరీ రోనాల్డ్ రోస్ సూచించారు. విద్యార్థుల హాజరు వంద శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా విద్యాసంస్థల్లో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులపై సంబంధిత ఆర్సీవోలు, ప్రిన్సిపాళ్లతో హైదరాబాద్ నుంచి సోమవారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ముందుగా టెస్ట్బుక్స్, నోట్ బుక్స్, స్టడీ మెటిరీయల్ పంపిణీ చేయాలని, ఉపాధ్యాయుల కొరత ఉంటే ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన ఆహార వస్తువులు, కాస్మోటిక్స్ సామాన్ల కోసం టెండర్ల ప్రక్రియను వెంటనే మొదలు పెట్టాలని సూచించారు. వర్షాకాలం వచ్చినందున ఆర్వో ప్లాంట్లు సక్రమంగా పనిచేసేలా చూడాలన్నారు. విద్యార్థుల ఆరోగ్య రక్షణకు ప్రాముఖ్యత ఇవ్వాలని, సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అనంతరం భద్రాచలం ఇన్చార్జి ఆర్సీవో డేవిడ్రాజ్ మాట్లాడుతూ.. ఖమ్మం రీజియన్లో విద్యార్థుల హాజరు వంద శాతం ఉందని, ఉపాధ్యాయులు లేని చోట వేరేవారిని తాత్కాలికంగా ఏర్పాటు చేశామని వివరించారు. విద్యార్థులకు అన్ని రకాల మెటిరీయల్స్ అందజేశామని, టెండర్ ప్రక్రియను కూడా పూర్తి చేశామని సమాధానమిచ్చారు.