భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ భద్రాచలం, మే 6: ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చులన్నీ నమోదు చేయాలని భద్రాద్రి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రియాంక ఆల అన్నారు. భద్రాచలం ఆర్డీవో కార్యాలయంలోని ఎన్నికల అకౌంటింగ్ టీం ఆఫీస్ను సోమవారం సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఇప్పటి వరకు సీజ్ చేసిన నగదు, అందులో తిరిగి ఇచ్చేసిన మొత్తం తదితర వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్నారు. అభ్యర్థుల ర్యాలీలు, ఖర్చుల వివరాలను ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేయాలని చెప్పారు. ప్రచారానికి అనుమతించిన వాహనాలకు మించి ఉన్నట్లయితే.. మొత్తం అనుమతినే రద్దు చేయాలని ఆదేశించారు. ఒక అభ్యర్థి అనుమతి తీసుకున్న వాహనాన్ని వేరొక అభ్యర్థి వినియోగించరాదని స్పష్టం చేశారు.
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో వచ్చే ఎన్నికల ప్రకటనలను వాటి రేట్ల ఆధారంగా అభ్యర్థి ఖర్చులో జమ చేయాలని చెప్పారు. అన్ని చెక్పోస్టుల వద్ద తనిఖీలను నిశితంగా నిర్వహించాలన్నారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంలో అకౌంటింగ్ బృందాలు, ఫ్లయింగ్ స్కాడ్, వీఎస్టీ, ఎస్ఎస్టీ క్రియాశీలకంగా వ్యవహరించాలని అన్నారు. సెలవు దినాల్లో కూడా నిఘా పెంచాలన్నారు. స్టాటిక్ సర్వేయలెన్స్ అధికారులు ప్రతి వాహనాన్ని వీడియోగ్రఫీతో తనిఖీ చేయాలన్నారు. వాహనాల తనిఖీ, జప్తు చేసిన నగదు, ఇతర సమాచారానికి సంబంధించిన వివరాలను నిర్దిష్ట నమూనాలో సంబంధిత అథిధికారుల ద్వారా రోజూ పంపించాలన్నారు. జప్తు చేసిన వాటికి రసీదు ఇవ్వాలన్నారు. రాత్రి సమయాల్లో పలు జాగ్రత్తలతో తనిఖీలు నిర్వహించాలన్నారు. భద్రాచలం ఏఆర్వో/ఆర్డీవో దామోదరరావు, అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ వేల్పుల శ్రీనివాస్, అకౌంటింగ్ టీం సభ్యుడు రాజు తదితరులు పాల్గొన్నారు.