రఘునాథపాలెం, జూలై 12 : విజయ డెయిరీ పార్లర్ నిర్వహణను స్థానికులకే కేటాయించాలంటూ రోటరీనగర్ వాసులు ఆందోళన చేపట్టారు. స్థానికులకు కాకుండా ఓ ఏజెన్సీకి అనుమతులు తెచ్చుకోవడంతో విషయం తెలిసి స్థానికులు పెద్దఎత్తున పార్లర్ వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. వివరాల్లోకెళ్తే.. ఖమ్మం విజయ డెయిరీ ఎదుట పాలు, పాల ఉత్పత్తులను విక్రయించేందుకు కేటాయించిన పార్లర్ను గతంలో స్వాతి ఏజెన్సీకి కేటాయించారు. అయితే గడువు ముగియడంతో గత కొద్దిరోజులుగా పార్లర్ నిర్వహణ ఆగిపోయింది. ఎన్నికల అనంతరం తిరిగి స్వాతి ఏజెన్సీ నిర్వాహకులే తిరిగి అనుమతులు తెచ్చుకోవడంతోపాటు శుక్రవారం ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. విషయం తెలిసిన రోటరీనగర్ వాసులు పార్లర్ వద్దకు చేరుకొని ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్నారు. పార్లర్ ఎదుట బైఠాయించి పునఃప్రారంభించకుండా నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువురిని స్టేషన్కు పిలిపించి మాట్లాడారు. అయితే స్వాతి ఏజెన్సీ వారికి అనుమతులు ఉండడంతో ఆందోళన చేసిన వారిని పోలీసులు హెచ్చరించి పంపినట్లు తెలిసింది.