కార్పొరేట్ను తలదన్నే సౌకర్యాలు.. నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం చదువులు.. ఉచితంగా పుస్తకాలు, యూనిఫాం, నోట్బుక్స్ కూడా ఇస్తుండడంతో సర్కార్ బడులకు ఫుల్ డిమాండ్ పెరిగింది. విద్యార్థులు ప్రైవేట్ను వదిలి.. ప్రభుత్వ పాఠశాలలవైపు కదిలారు. తల్లిదండ్రులు స్వచ్ఛందంగా తమ పిల్లల్ని సర్కార్ బడుల్లో చేర్పిస్తున్నారు. కార్పొ‘రేట్’కు భయపడి ‘ప్రభుత్వ బడి’ బాట పడుతున్నారు. మన ఊరు-మన బడిలో భాగంగా అన్ని స్కూళ్లలో సకల సౌకర్యాలతోపాటు ఇంగ్లిష్ మీడియం బోధన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అడ్మిషన్లు భారీగా పెరగడంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలన్నీ కళకళలాడుతున్నాయి.
– ఖమ్మం ఎడ్యుకేషన్, జూలై 2
“ఖమ్మం నయాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ ఏడాది 160 మందికి ప్రవేశాలు కల్పించాం. మొత్తం విద్యార్థుల సంఖ్య 336కి చేరింది. ఇంకా రోజుకు నాలుగైదు అడ్మిషన్లు వస్తూనే ఉన్నాయి. గత సంవత్సరం తరగతికి ఒక్కో సెక్షన్ మాత్రమే నిర్వహించాం. ఈ ఏడాది అన్ని తరగతుల్లో రెండు సెక్షన్లు పూర్తిగా నిండిపోయాయి.”
– గాయత్రి, ప్రధానోపాధ్యాయురాలు
“నగరంలోని ఎన్ఎస్సీ కెనాల్ ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటివరకు 300 అడ్మిషన్లు వచ్చాయి. విద్యార్థుల సంఖ్య 822కి చేరింది. 7, 8, 9వ తరగతుల్లో కూడా అడ్మిషన్లు ఎక్కువగా వస్తున్నాయి. అడ్మిషన్లు ఫుల్ అని చెప్పినా వస్తూనే ఉన్నారు. ఇంకో వంద వరకు అడ్మిషన్లు అయ్యే అవకాశం ఉంది.”
– ఎం.శంకర్రావు, ప్రధానోపాధ్యాయుడు
ఖమ్మం ఎడ్యుకేషన్, జూలై 2 : అమ్మా నేను సర్కార్ బళ్ల్లోనే చదువుతనే.. సర్కార్ బళ్ల్లనే చదువు బాగా చెప్తరే. ప్రభుత్వ బళ్లనే చదివి పెద్ద నౌకరి సంపాదిస్తనే.. సర్కారు బళ్లో అన్ని ఉచితంగా వత్తయ్..‘కార్పొరేట్’ బడోళ్లు మస్తు పైసల్ లాగుతుండ్రే. మనకొద్దే ఈ దోపిడీ చదువులూ.. ఇదీ ప్రైవేటు బడిలో చదివిన ఓ విద్యార్థి ఈ విద్యా సంవత్సరం మొదట్లో తన తల్లితో మొరపెట్టుకున్న ఆవేదన. ఇది కేవలం ఒకరిద్దరు విద్యార్థులది కాదు. కేసీఆర్ సర్కార్ ‘ప్రభుత్వ బడు’ల ద్వారా అందిస్తున్న నాణ్యమైన ‘విద్య’కు ఆకర్షితులై చేరిన వేలాది మంది విద్యార్థుల్లో వచ్చిన మార్పు. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ బడులు నూతన ఒరవడిని సృష్టిస్తున్నాయి. విద్యార్థులు ‘ప్రైవేటు’ బడికి నై అంటూ.. సర్కార్ బడి సై అంటున్నారు. విద్యార్థులు ‘కార్పొరేట్’ చదువులు వద్దు మహాప్రభో.. అంటూ ప్రభుత్వ బడుల్లో చేరుతున్నారు.
మారిన బడి…
అర్హత గల టీచర్లు ఉన్నారు గానీ.. విద్యార్థులకు అక్షరాలు రావు.. విద్యా పథకాలు అమలవుతున్నాయి గానీ పాఠశాలలు బాగుపడలే.. నిధులు ఖర్చుపెట్టారు గానీ.. సౌకర్యాలు అందలే.. ఇది గతంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి. తెలంగాణ ప్రభుత్వ పాలనలో మన ఊరు-మన బడి పథకంలో భాగంగా పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. విద్యావ్యవస్థలో సమూల మార్పులు వచ్చాయి. ఇంగ్లిష్ మీడియం పూర్తిస్థాయిలో అమలు చేయడంతో ప్రభుత్వ పాఠశాలల వైపు విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ప్రభుత్వ బడులు విద్యార్థుల చేరికలతో కళకళలాడుతున్నాయి. గత ప్రభుత్వాల హయాంలో ప్రభుత్వ బడి అంటేనే చీదరించుకున్న తల్లిదండ్రులు నేడు తమ బిడ్డల్ని సర్కార్ బడుల్లోనే చేర్చుతామనే శపథం తీసుకుంటున్నారు. ప్రభుత్వ బడులకు స్వతంత్రంగా తీసుకుచ్చి తమ బిడ్డల్ని చేర్చుతున్నారు. ప్రైవేటులో వేలకు వేలు ఫీజులు కట్టి కూసింత ప్రయోజనం కూడా లేదని, సర్కార్ పాఠశాలల్లో అయితే తమ పిల్లలకు చదువుతోపాటు పౌష్టికాహారం అందుతుందని భావించి అడ్మిషన్లు పొందుతున్నారు.
ఉత్తమ ఫలితాలు..
ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన సామాన్య విద్యార్థులు అసామాన్య ఫలితాలు సాధించడంతో అప్పటివరకు ఆలోచించని ప్రైవేట్ పాఠశాలలకు పంపే విద్యార్థుల తల్లిదండ్రుల్లోనూ ఆలోచన మొదలైంది. ప్రభుత్వ పాఠశాలలను సంస్కరిస్తూ నాణ్యమైన విద్యాబోధనే ధ్యేయంగా సాగుతున్న ప్రణాళికలను ఎప్పటికప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులు గమనిస్తూనే ఉన్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు అవసరమైన పంచశక్తులు ఉచిత యూనిఫాం, ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఆట స్థలం, నాణ్యమైన బోధన ఎక్కడా రాజీపడకుండా అమలు చేస్తున్నారు. వీటితో విద్యార్థులు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షితులయ్యారు. ప్రైవేట్ వద్దు.. ప్రభుత్వమే ముద్దు అనేలా విద్యార్థులు సర్కార్ స్కూళ్లలో ప్రవేశాలు పొందుతున్నారు.
ప్రైవేట్ నుంచి ప్రభుత్వానికి…
ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని తరగతుల్లో ప్రవేశాలు పొందారు. ఈ విద్యాసంవత్సరం ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలల్లో 2,648 మంది విద్యార్థులు చేరారు. మండలాల వారీగా విద్యాశాఖకు అందిన గణాంకాల ప్రకారం…
పాఠాలు బాగా చెబుతున్నారు..
మేమిద్దరం అక్కాచెల్లెళ్లం. ఇంతకుముందు వేరే వేరే ప్రైవేట్ స్కూళ్లలో చదివాం. అమ్మానాన్న కష్టం చేస్తూ ఫీజులు కట్టేవారు. అయినప్పటికీ చదువు అంత బాగా చెప్పలే. ఈ ఏడాది ప్రైవేట్ వదిలి నయాబజార్ స్కూల్లో చేరాం. చదువు బాగా చదువు చెబుతున్నారు. అన్నీ ఉచితంగా ఇచ్చారు. ఇంగ్లిష్లో చెబుతూ అర్థం కాకపోతే మళ్లీ మళ్లీ చెబుతున్నారు.
– మహేశ్వరి-7వ తరగతి, మనూష-6వ తరగతి
మా ఫ్రెండ్స్ను కూడా రమ్మంటున్నాను..
మాది డోర్నకల్. అక్కడ ప్రైవేట్ స్కూల్లో చదివాను. ఈ సంవత్సరం ఖమ్మంలో హాస్టల్లో ఉంటూ నయాబజార్ స్కూల్లో చదువుతున్నాను. అక్కడి కంటే ఇక్కడే చాలా బాగుంది. పుస్తకాలు, యూనిఫాం, నోట్ పుస్తకాలు కూడా ఫ్రీగా ఇచ్చారు. మా ఫ్రెండ్స్ను కూడా సర్కార్ బడికే రమ్మని చెబుతున్నాను. డిజిటల్ పాఠాలు కూడా చెబుతున్నారు.
– యశ్వంత్, 6వ తరగతి