ఖమ్మం రూరల్, ఏప్రిల్ 28 : మార్క్సిస్టు కార్యకర్తలు సైద్ధాంతిక అవగాహన కలిగి ఉండాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్ వద్ద గల తమ్మినేని సుబ్బయ్య భవనంలో పాలేరు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కార్యకర్తలకు మంగళవారం స్టడీ సర్కిల్ నిర్వహించారు. ఈ స్టడీ సర్కిల్ ను సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ప్రారంభించారు. స్టడీ సర్కిల్ కు ముఖ్య అతిథిగా హాజరైన తమ్మినేని ప్రసంగిస్తూ.. ప్రతి మార్క్సిస్టు కార్యకర్త దేశ, అంతర్జాతీయ రాజకీయాలను నిరంతరం అధ్యయనం చేయాలని ప్రతి విషయంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మతోన్మాదులు అనేక రూపాలలో అబద్దాలు, దుష్ప్రచారాలు, మాయమటలతో కార్యకర్తలను మానసికంగా ఇబ్బంది పెట్టేందుకు ఎన్నో కుటిల ప్రయత్నాలు చేస్తుంటారని వాటన్నిటిని తిప్పి కొట్టాలంటే నిరంతర అధ్యయనం ముఖ్యమని తెలిపారు.
సైద్ధాంతికంగా బలంగా ఉన్నప్పుడే ఎన్ని ఆటుపోట్లయినా ఎదుర్కోవచ్చని సూచించారు. ప్రతి ఒక్కరూ రాజకీయ చైతన్యం కలిగి ఉండాలని యువత, మహిళలు రాజకీయాల్లోకి రావాలని, నిత్యం రాజకీయాలను పరిశీలించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. ఇరాన్ పట్ల అమెరికా, ఇజ్రాయెల్ వ్యవహరిస్తున్న తీరును వివరించారు. ఈ స్టడీ సర్కిల్లో సీపీఎం రాష్ట్ర నాయకురాలు బుగ్గవీటి సరళ, పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేష్, స్టడీ సర్కిల్ కన్వీనర్ షేక్ బషీరుద్దీన్, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఉరడీ సుదర్శన్ రెడ్డి, నండ్ర ప్రసాద్, పలువురు పాలేరు డివిజన్ నాయకులు పాల్గొన్నారు.