వైరాటౌన్, జూన్ 8 : ఏన్కూరు తహసీల్దార్ ఓ రైతు నుంచి రూ.3వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు గురువారం వల పన్ని పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. భద్రుతండాకు చెందిన బానోతు రామకృష్ణ తన తల్లి పేర సర్వే నెంబర్ 136లో ఉన్న 2.20 ఎకరాల భూమిలో 24 కుంటల భూమిని తన పేరుపై పట్టా చేయాలని తహసీల్దార్ షేక్ ఖాసీంను కలిశారు. దీనికి తహసీల్దార్ రూ.5వేలు డిమాండ్ చేశారు. ఇందులో రూ.3వేలు ఇస్తానని ఒప్పుకున్న రామకృష్ణ.. ఏసీబీ అధికారులను ఆశ్రయించి విషయాన్ని చెప్పాడు. వారి సూచన మేరకు రామకృష్ణ రూ.3వేలను తహసీల్దార్ ఖాసీంకు గురువారం ఆయన కార్యాలయంలో ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. పంచనామా నిర్వహించి తహసీల్దార్ను ఏసీబీ కోర్టుకు పంపనున్నట్లు డీఎస్పీ తెలిపారు. దాడుల్లో బాలకృష్ణ, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
తహసీల్దార్ ఇంట్లో సోదాలు
ఏన్కూరులో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఖమ్మానికి చెందిన తహసీల్దార్ ఎస్కే ఖాసీం నివాసంలోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. చెరువు బజారులోని తహసీల్దార్ ఇంటికి వెళ్లిన ఏసీబీ అధికారులు మూడు గంటలపాటు తనిఖీలు చేపట్టారు. కుటుంబ సభ్యుల నుంచి సమాచారం రాబట్టడంతోపాటు పలు విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.