ఖమ్మం, డిసెంబర్ 29: గ్రామ, వార్డు సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజాపాలన కార్యక్రమ ఉమ్మడి ఖమ్మం జిల్లా నోడల్ అధికారి ఎం.రఘునందన్రావు సూచించారు. ఆరు గ్యారెంటీ పథకాలకు దరఖాస్తు చేసుకునే వారు తమ దరఖాస్తుకు ఆధార్, రేషన్ కార్డుల జిరాక్సులను జత చేస్తే చాలని అన్నారు. ఇవి తప్ప మరే ధ్రువపత్రాలు అవసరం లేదని అన్నారు. రేషన్ కార్డు లేని దరఖాస్తుదారులు ఉంటే వారి ఉమ్మడి కుటుంబ యజమాని కార్డు నంబరును సదరు దరఖాస్తుపై వేయాలని సూచించారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఖమ్మం 7వ డివిజన్ మహిళా ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన వార్డు సభను ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్తో కలిసి ఆయన పరిశీలించారు.దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను గమనించి ప్రజాపాలన కార్యక్రమంపై సిబ్బందికి, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అభయహస్తం ఆరు గ్యారెంటీ పథకాల అమలుకు అర్హుల నుంచి దరఖాస్తులు సేకరిస్తున్నట్లు చెప్పారు.
ఈ నెల 28నే అభయహస్తం గ్రామసభలు ప్రారంభమైనందున అర్హులైన ప్రజలు వచ్చే 6లోగా తమ ప్రాంతాల్లో నిర్ణీత తేదీల్లో నిర్వహించే గ్రామ, వార్డు సభల్లో తమ దరఖాస్తులను అందజేయాలని సూచించారు. ఒక కుటుంబానికి ఒక దరఖాస్తు ఫారం సరిపోతుందని అన్నారు. కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఏ పథకం వర్తిస్తుందో ఆ మేరకు వివరాలు పూరించాలని సూచించారు. ఈ విషయంలో ఏ సందేహాలున్నా సభలోని హెల్ప్ డెస్కు సిబ్బంది వద్ద నివృత్తి చేసుకోవాలని సూచించారు. అయితే, గ్రామసభల్లో దరఖాస్తులు అందజేయలేని వారు జనవరి 6 లోగా వార్డు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఆ దరఖాస్తులను సమర్పించవచ్చని అన్నారు. ఈ విషయంలో ఆందోళనలేమీ అవసరం లేదని అన్నారు. అయితే, అధికారులు కూడా స్వీకరించిన దరఖాస్తులను భద్రపరచి డాటా నమోదు చేయాలని సూచించారు. ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 62 టీములను ఏర్పాటు చేశామని, ఒకో టీములో 10 మంది అధికారులను నియమించామని తెలిపారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు టీమ్ లీడర్లుగా వ్యవహరిస్తూ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, సహాయ శిక్షణ కలెక్టర్ మయాంక్ సింగ్ , స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి, ఇతర అధికారులు విద్యాచందన, హరికిషన్, సోమశేఖరశర్మ, శ్రీలత, విజేత తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్
ఆరు గ్యారెంటీ పథకాల కోసం అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. ఖమ్మం ఒకటో డివిజన్ టీఎన్జీవోస్ కాలనీ, రాపర్తినగర్లోని ఎస్సీ స్టడీ సరిల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రజాపాలన వార్డు సభను శుక్రవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. సభ నిర్వహించబోయే ముందు రోజే సంబంధిత కాలనీల ప్రజలకు ప్రభుత్వ సిబ్బంది ద్వారా దరఖాస్తులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. దరఖాస్తుదారులు వాటిని పూరించి రేషన్, ఆధార్ జిరాక్సులు జత చేసి సభలోని కౌంటర్ అందజేసి రసీదు పొందాలని సూచించారు. అధికారులు రామారావు, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
నేడు నగరంలోని ఎనిమిది డివిజన్లలో వార్డు సభలు
ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అభయహస్తం ఆరు గ్యారెంటీల కోసం ఖమ్మం నగరంలోని ఎనిమిది డివిజన్లలో శనివారం వార్డు సభలను నిర్వహించనున్నట్లు కేఎంసీ అధికారులు తెలిపారు. 2వ డివిజన్ పాండురంగాపురం, 14వ డివిజన్ కొత్తగూడెం, గొల్లగూడెం, మధురానగర్, 15వ డివిజన్ అల్లిపురం, రుద్రంకొట, పుట్టకోట, 16వ డివిజన్ ధంసలాపురం, అగ్రహారం, కొత్తూరు కాలనీల్లో ఉదయం, మధ్యాహ్నం వేళల్లో వార్డు సభలు నిర్వహించనున్నట్లు వివరించారు.