జూలూరుపాడు, ఏప్రిల్ 18 : ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వర్తించినన్ని రోజులు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి చదువుల్లో మెరికల్లా తీర్చిదిద్దాడు. వారు ఉన్నతంగా ఎదిగేందుకు నిరంతరం తపించి తనవంతు కృషి చేశాడు. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత ఆ సమయాన్ని వృథా చేయకుండా మెదడుకు పదును పెట్టి వెదరు బొంగులతో అందమైన కళాకృతులు, బొమ్మలు తయారు చేస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటున్నాడీ రిటైర్డ్ మాస్టారు సున్నం రామకృష్ణమాచారి. జూలూరుపాడు గ్రామానికి చెందిన రామకృష్ణమాచారి ఉపాధ్యాయుడిగా పని చేసినంత కాలం పాఠశాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించి వారి ఉన్నతికి ఎంతో కృష చేశారు. ఉద్యోగ విరమణ తర్వాత వెదురుతో వివిధ రకాల కళాకృతులను తయారు చేయడం అభిరుచిగా మార్చుకున్నాడు. ఇంట్లో ఉండే అలంకరణ వస్తువుల దగ్గర నుంచి నిత్యం మన వాడుకునే సామగ్రిని వెదురుతో తయారు చేసి పలువురి మెప్పు పొందాడు. ప్రశంసలు అందుకున్నాడు. సమీప ప్రాంతాల్లో వెదురు బొంగులను సేకరించి వాటిని ముక్కలుగా కత్తిరించి వాటితో దేవతామూర్తుల చిత్రాలు, క్రికెట్ కప్లు, ఫ్లవర్ వాజ్లు, పెన్నుల స్టాండ్లు, పేపర్ వెయిటర్, ఫోన్ బాక్స్, దువ్వెనలు, బ్రష్లు పెట్టుకునే స్టాండ్లు, పూల బుట్టలు, సబ్బు పెట్టెలు, బెడ్ ల్యాంప్లు, పలు వాహనాల నమూనాలు, పక్షుల బొమ్మలు ఇలా పలు రకాల వస్తువులను తయారు చేసి వాటికి రంగులు వేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నాడు. తన ఇంటికి వచ్చిన అతిథులను ఖాళీ చేతులతో పంపకుండా తాను వెదురుతో తీర్చిదిద్దిన వస్తువులను ఇచ్చి పంపడం పరిపాటిగా చేసుకున్నాడు. ఇక శుభకార్యాలకు వెళ్లిన క్రమంలో బహుమతుల రూపంలో తాను రూపొందించిన కళాకృతులను అందిస్తూ పర్యావరణ ప్రేమికుడిగా మారాడు.
ఉద్యోగ విరమణ తర్వాత ఇంట్లో ఖాళీగా కూర్చొని సమయాన్ని వృథా చేయకుండా వెదురుతో బొమ్మలు తయారు చేయాలనే ఆలోచన తట్టింది. దాదాపు పదేళ్ల నుంచి కొన్ని వందల రకాల బొమ్మలు, వస్తువులను తయారు చేసి.. వాటికి రంగులు అద్ది ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నాను. ఇంకా వెదురుతో కొత్త కొత్త వస్తువులు రూపొందించాలనే ప్రయత్నం చేస్తున్నాను.
-సున్నం రామకృష్ణమాచారి, రిటైర్డ్ ఉపాధ్యాయుడు, జూలూరుపాడు