పాల్వంచ, ఫిబ్రవరి 16 : ప్రతి ఒక్కరి జీవితంలొ స్నేహితుల పాత్ర కీలకం. ఆటాపాటలు, చిలిపి పనులు, కష్టం, సుఖం ఇలా ఏదైనా కాని మన వెన్నంటే ఉండి నేనున్నాను అంటూ ధైర్యం చెప్పేదే స్నేహం. ఆనందం, బాల్యం, స్మృతులు, కరచాలనాలు, చెమ్మగిల్లిన కళ్ళతో అలింగనాలు గురువుల మందలింపులు తలుచుకుంటూ ఒకసారి వయస్సు మరచి పోయి చిన్న పిల్లల కేరింతలతో పాఠశాల అవరణం కోలాహలంగా మారింది. ఈ ప్రాంగణంలో అడుగు పెడుతూనే హోదాలను మరిచి ఒకరినొకరు ఆత్మీయంగా పలకరిస్తూ యోగ, క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పాల్వంచ పట్టణంలోని బొల్లోరుగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2004-05 విద్యా సంవత్సరం పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం కన్నుల పండువగా జరిగింది.
ఎక్కడెక్కడో స్థిర పడిన వారు, ఉద్యోగులుగా, గృహిణులుగా, వేర్వేరు రంగాల్లో స్థిర పడ్డ వారు తమ మిత్రులను కలవాలనే తలంపుతో ఒక్క చోటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆనాటి గురువుల బోధనలు తమ కుటుంబ పరిస్థితులు నాటి చిలిపి చేష్టలను క్రమశిక్షణ పేరుతో గురువుల దండనలు తలుచుకుంటూ సాగిన పూర్వ విద్యార్థుల ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. దివంగతులైన ఉపాధ్యాయులు బ్రహ్మచారి, తెలుగు పండిట్ రాజు, సైన్స్ టీచర్ ఇందిర, పీఈటీ మురళిలకు నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీరాములు, నాగేశ్వరరావు, సుధాకర్, పద్మలత, జేవీఆర్ శ్రీనివాస్, వీటీఆర్, కూర్మేశ్వర్ రావు, సీతారామలక్ష్మి, శారద, శ్రీనివాస్ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఆడిన ఆటలు, పాడిన పాటలు అలరించాయి. వచ్చిన పూర్వ విద్యార్థులు పాఠశాల ఆవరణలో పొద్దు పోయే వరకు గడిపి బరువెక్కిన హృదయాలతో ఎవరి గమ్య స్థానాలకు వారు కదిలారు.