మామిళ్లగూడెం, మే 20: జిల్లాలో నకిలీ విత్తనాల కట్టడికి ప్రత్యేక టాస్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు సీపీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. నకిలీ విత్తనాలపై ఉకుపాదం మోపేలా రాష్ట్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలను విడుదల చేసిన నేపథ్యంలో పోలీసు, వ్యవసాయ అధికారులతో ఖమ్మం పోలీస్ కమిషనరేట్లో శనివారం ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. నకిలీ విత్తనాలను అరికట్టడమే లక్ష్యంగా జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన విస్తృత తనిఖీలు చేపట్టనున్నట్లు చెప్పారు.
మండల, డివిజన్ స్థాయిల్లో కూడా టాస్ఫోర్స్ బృందాలు నిరంతరం క్షేత్రస్థాయిలో ఉంటాయని తెలిపారు. అలాగే పాత నేరస్తులపైన నిఘా పెట్టామని, బైండోవర్స్ కూడా చేస్తున్నామని, అవసరమైతే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని అన్నారు. రైతుల అమాయకత్వాని ఆసరాగా చేసుకొని దళారులు నకిలీ విత్తనాలు విక్రయిస్తుంటారని, తక్కువ ధరకు వస్తున్నాయనుకొని రైతులు మోసపోతుంటారని అన్నారు. దళారుల కట్టడికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినందున విస్తృత తనిఖీలకు అధికారులు సిద్ధం కావాలని సూచించారు.
మండల కేంద్రాలు, గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. లైసెన్స్ లేకుండా విక్రయాలు జరిపినా, ముగిసిన విత్తనాలను విక్రయించినట్లు గుర్తించినా వెంటనే సదరు వ్యాపారులపై చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా మద్యం అక్రమ రవాణాను నియంత్రించేందుకు జిల్లా సరిహద్దుల్లో నిఘా పెంచినట్లు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నట్లు చెప్పారు. ఏడీసీపీ సుభాశ్ చంద్రబోస్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేంద్రరెడ్డి, ఏసీపీలు గణేశ్, బస్వారెడ్డి, రెహమాన్, రామానుజం, ప్రసన్నకుమార్, వెంకటస్వామి, వెంకటేశ్వరరావు, వ్యవసాయ శాఖ అధికారి కిశోర్బాబు తదితరులు పాల్గొన్నారు.