బోనకల్లు, జనవరి 29: ఏపీలోని ప్రశ్చిమ గోదావరి జిల్లాలో సోమవారం జరుగనున్న సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీలో పాల్గొనాలని కోరుతూ.. మండలంలోని కలకోట గ్రామానికి చెందిన ఆదర్శ రైతు పైడిపల్లి దశరథరావుకు ఆహ్వానం అందింది. వైరాలోని కృషి విజ్ఞాన కేంద్రం సహకారంతో వరి సాగులో ఎన్నో వినూత్న ప్రయోగాలు చేసి విజయం సాధించారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం దశరథరావును స్వయంగా పిలిపించుకొని సాగు విధానాలను తెలుసుకున్నారు.
సోమవారం జరగబోయే ఎస్ఏసీ సమావేశంలో నేరుగా వరి వెదజల్లే సాగు చేయడంలో ఆయన అనుభవాలను రైతులు, శాస్త్రవేత్తలతో పంచుకోనున్నారు. వైరాలోని కృషి విజ్ఞాన కేంద్రంలో పనిచేస్తున్నప్పుడు దశరథరావు గురించి తెలిపిన శాస్త్రవేత్త డాక్టర్ మల్లికార్జునరావు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తున్నారు. అక్కడ రైతుల ప్రయోజనాల కోసం ఎస్ఏసీ సమావేశానికి ఆహ్వానించారు. గతంలోను నేరుగా వరిని వెదజల్లి సాగు చేసే విధానం గురించి దశరథరావు ద్వారా తెలుసుకున్న రైతు తోటపల్లి జాషూవా తెలంగాణ సోన రకంతో అధిక దిగుబడి సాధించారు.
అప్పటికే ఆ విధమైన వరిసాగులో విజయం సాధించిన దశరధరావు సాగు విధానాలను తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వరి నాటులో నేరుగా వెదజల్లే పద్దతి ద్వారా వరి సాగు చేస్తే ఎకరాకు రెండు క్వింటాళ్ల దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇదే పద్ధతిలో పంట పండిస్తే తెలంగాణ రైతాంగానికి సుమారు రూ.10 వేల కోట్లపైనే పెట్టుబడి ఆదా అవుతుందని 29 మే 2021న వ్యవసాయశాఖపై జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో చెప్పారు. అంతటి ఘనత వహించిన దశరధరావు మరిన్ని విజయాలు అందుకోవాలని కలకోట గ్రామం, బోనకల్లు మండల రైతాంగం కోరుకుంటున్నారు.