అశ్వారావుపేట, ఫిబ్రవరి 23 : మండల ప్రజలకు న్యాయ సేవలు మరింతగా దగ్గరయ్యాయి. నియోజకవర్గంలోనే రెండో పెద్ద మండలమైన దమ్మపేటలో కోర్టు(న్యాయస్థానం) ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. న్యాయస్థానం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో ఉండడం.. కేసుల విషయంలో నిత్యం అక్కడికి వెళ్లాల్సి రావడం ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ఈ అంశాన్ని అప్పటి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆనాటి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించిన మెచ్చా ఇందుకు అవసరమైన భవనాన్ని సైతం ఎంపిక చేశారు. అధికారులు కోర్టు ఏర్పాటుకు వసతులు కూడా కల్పించారు.
ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో గత కేసీఆర్ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. దీంతో అప్పటి వరకు ఉమ్మడి జిల్లాలోని సత్తుపల్లి పరిధిలో ఉన్న ప్రభుత్వ ప్రధాన శాఖలు కొత్తగూడెం జిల్లాలోకి వెళ్లాయి. ఈ క్రమంలో అప్పటి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు.. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ సహకారంతో అశ్వారావుపేటలోనే అన్ని ప్రభుత్వ ప్రధాన శాఖల సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒక్క కోర్టు భవనం సిద్ధమైనా ఇల్లెందు నుంచి తరలించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి రావడం ఆలస్యమైంది. తాజాగా ఈ నెల 22న లీగల్ ఎఫైర్స్, లెజిస్లేటివ్ ఎఫైర్స్ అండ్ జస్టిస్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కార్యాలయం నుంచి జీవో 99ని జారీ చేశారు. ఇల్లెందులో ఉన్న జూనియర్ సివిల్ జడ్జి అండ్ జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టును దమ్మపేటకు బదిలీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కోర్టు తరలింపునకు అనుమతి రావడంతో అధికారులు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. కోర్టు ప్రారంభం కాగానే నియోజకవర్గ ప్రజలకు న్యాయ సేవలు అందుబాటులోకి వస్తాయి. మార్చి మొదటి వారంలో కోర్టు ఏర్పాట్లు పూర్తి కావొచ్చని అధికారులు భావిస్తున్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ కేంద్రంలో ఉండాల్సిన ప్రధాన ప్రభుత్వ శాఖల సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చాను. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు. ఇప్పుడు కోర్టును దమ్మపేటలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతిస్తూ జీవో జారీ చేయడంతో ఆ కల కూడా నెరవేరింది.