మట్టి రోడ్లపై తట్టెడు మట్టిపోసే వారు లేక ఇన్నాళ్లూ వాహనదారులు పడుతూ లేస్తూ పయనించారు. వర్షాలతో వాగులు వంకలు పొంగి లోతట్టు కాజ్వేలపై నీరు ప్రవహించినప్పుడు చుట్టూ కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఇళ్లకు చేరారు. ఈ కష్టాలు ఎప్పుడు పోతాయి..? ఈ పాలకులు ఎప్పుడు మారుతారు..? అంటూ తమలో తామే మదనపడ్డారు. పల్లె రోడ్లు మారవా..? వాగులపై బ్రిడ్జీలు కట్టరా..? అని గత ప్రభుత్వంలో పాలకులను నిలదీసి ప్రశ్నించినా సమాధానం చెప్పేవారు కరువయ్యారు. తెలంగాణ పాలనలో ఆ కష్టాలన్నీ తీరాయి. గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వచ్చాయి.. బ్రిడ్జీలు మంజూరయ్యాయి. సత్తుపల్లి నియోజకవర్గంలో ఇంతటి అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే సండ్రను, సీఎం కేసీఆర్ను, తెలంగాణ ప్రభుత్వాన్ని ఆ ప్రాంత ప్రజలు మెచ్చుకుంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పెనుబల్లి, ఆగస్టు 31 : గత ప్రభుత్వాల పాలనలో గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు లేక ప్రజలు నానా అవస్థలు పడ్డారు. రాళ్ల బాటలు, మట్టి రోడ్లపైనే ఇబ్బందులు పడుతూ ప్రయాణించారు. వాగులు ఉన్న ప్రాంతాల్లో బ్రిడ్జిలు నిర్మించకపోవడంతో కిలోమీటర్ల కొద్దీ తిరిగి ఇళ్లకు చేరుకునేవారు. వర్షాకాలంలో ఆయా గ్రామాల ప్రజల పరిస్థితి వర్ణనాతీతం. ఇలాంటి సమస్యలపై దృష్టి సారించే ప్రభుత్వాలు లేక.. ప్రజలు తమ సమస్యలను ఆనాటి ప్రజాప్రతినిధులకు విన్నవించినా పరిష్కరించేవారు లేక ఏళ్లకొద్దీ ఇబ్బందులతోనే గడిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అతి తక్కువ కాలంలోనే ప్రభుత్వం కోట్లాది రూపాయలతో పల్లె రోడ్లను అభివృద్ధి చేయడమే కాకుండా లోతట్టు ప్రాంతాల్లో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణాలపై దృష్టి సారించింది.
సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరిస్తూ.. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. ఇందులో భాగంగా మండలంలోని ఎల్ఎస్.బంజర వాగుపై వంతెన నిర్మాణానికి రూ.7.50కోట్లు మంజూరు చేయించగా.. దాదాపు నిర్మాణ పనులన్నీ పూర్తయ్యాయి. పెనుబల్లి-గంగిదేవిపాడు గ్రామాల మధ్య వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే రూ.8.50కోట్ల నిధులు మంజూరు చేయించారు. గణేశన్పాడు, ఎల్ఎస్.బంజర్ గ్రామాలు పెనుబల్లి మండలంలో ఉండడం.. ఆయా గ్రామాల మధ్య బ్రిడ్జి లేకపోవడంతో వానకాలంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడేది. దీంతో ఏపీ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా తిరువూరు నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఆయా గ్రామాల ప్రజలు వాగులపై బ్రిడ్జి నిర్మించాలని ఎమ్మెల్యే సండ్ర దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఎంతో చొరవతో రూ.7.50కోట్ల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణంతోపాటు బీటీ రోడ్డును కూడా ఏర్పాటు చేయించారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే గణేశన్పాడు, ఎల్ఎస్.బంజర్తోపాటు పలు గ్రామాల ప్రజలు పెనుబల్లి మండల కేంద్రానికి రాకపోకలు సాగించడానికి తిరువూరు నుంచి వెళ్లి వచ్చే ఇబ్బందులు తొలగుతాయి. దీర్ఘకాలికంగా ఉన్న ప్రధాన బ్రిడ్జిల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిధులు వెచ్చించడం, ఇందుకు ఎమ్మెల్యే సండ్ర ఎంతో కృషి చేయడం పట్ల పెనుబల్లి మండల ప్రజలు ప్రభుత్వానికి, ఎమ్మెల్యే సండ్రకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఏళ్ల కల నెరవేరింది
గతంలో ఎన్నో ప్రభుత్వాలకు, ఎంతో మంది ప్రజాప్రతినిధులకు విన్నవించినా.. దరఖాస్తులు చేసినా చేద్దాం.. చూద్దాం.. అనే వాళ్లే కానీ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయలేదు. ఎమ్మెల్యే సండ్ర ఎంతో చొరవ చూపి బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడం ఆయన పట్టుదలకు నిదర్శనం. ప్రభుత్వానికి, ఎమ్మెల్యే సండ్రకు ప్రజలు, రైతులు రుణపడి ఉంటారు.
– కనగాల వెంకట్రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు
సండ్రతోనే సాధ్యమైంది
మండలానికి రావాలంటే పక్క రాష్ట్రం నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చొరవ, పట్టుదలతో నిధులు మంజూరు చేయించి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయించారు. త్వరలో ప్రారంభమైతే ఈ ప్రాంత ప్రజల కష్టాలు తొలగుతాయి. ఏ కాలంలోనైనా ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయొచ్చు. ఎమ్మెల్యే సండ్రను, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజలు మరచిపోలేరు.
– లగడపాటి శ్రీనివాస్రావు, ఆత్మ కమిటీ డైరెక్టర్, గణేశన్పాడు
రైతుల బాధలు తీరాయి
వర్షం వస్తే రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి ఉండేది. వరినాట్లు వేసేందుకు ట్రాక్టర్లతో కూలీలను తీసుకురావడానికి, మందు కట్టలు మోసేందుకు ఎన్నో ఇబ్బందులు పడేవాళ్లం. రెండు, మూడు రోజులపాటు వాగు పొంగితే పొలాలు మునిగిపోయి బాధపడేవాళ్లం. బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేసిన ఎమ్మెల్యే సండ్రకు రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
-వేంపాటి అనంతరావు, రైతు, పెనుబల్లి