కూసుమంచి రూరల్, మార్చి 28: మండలంలో ప్రైవేట్ నర్సరీలు యజమానులకు కాసుల పంట పండిస్తోంది. జిల్లాలో ఎక్కడాలేనంతగా పదేళ్లలో వందలాది ఎకరాల్లో పండ్ల మొక్కలు పెంచి, విక్రయించే ప్రైవేటు నర్సరీలు ఏర్పాటయ్యాయి. వీటిలో అత్యధికంగా మామిడి (80శాతం), జామ, కొబ్బరి, నిమ్మ, ఉసిరి, నేరెడు తదితర మొక్కలు నర్సరీల్లో పెంచుతున్నారు. మామిడిలో దాదాపు 23 రకాల మొక్కలను పెంచుతున్నారు. విత్తనాల కోసం వివిధ రకాల మామిడి టెంకలు (పిక్కెలు) మెదక్, సంగారెడ్డి, మహబూబ్నగర్, సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తారు. మొక్కలు ఏర్పడ్డాక మరో రకం మొక్కతో (గ్రాఫ్టింగ్)అంటుకడుతారు. కూలీలతో అంటు కట్టిస్తారు. ఈప్రక్రియ అనంతరం 5 కిలోలు (ఆరు నెలల వయసు), 10 కిలోలు (ఏడాది), 50 కిలోలు (రెండేండ్లు)గా విభజిస్తారు. ఎక్కువ వయస్సు గల మొక్కలకు అధిక రేట్లు ఉంటాయి. మొక్కలను ఏపీలోని చిత్తూరు, కర్నూలు, రాజమండ్రి, మందపల్లితో పాటు ఛత్తీస్గఢ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా తదితర రాష్ర్టాలకు మొక్కలను ఎగుమతి చేస్తారు.
700 ఎకరాల్లో ప్రైవేట్ నర్సరీలు
మండలంలోని లోక్యాతండ, గురువాయిగూడెం, గట్టుసింగారం, పాలేరు తదితర గ్రామాల శివారులో వ్యవసాయ భూములు లీజుకు తీసుకుని నర్సరీలను ఏర్పాటు చేశారు. 1996 నుంచే ఈప్రాంతంలో ప్రైవేట్ నర్సరీలు ప్రారంభం అయినప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక నిర్వహిస్తున్న హరితహారంతో ప్రజల్లో మొక్కల పెంపకం పట్ల ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఆయా గ్రామాల్లో సుమారు 700 ఎకరాల్లో నర్సరీలు ఏర్పాటైనట్లు అంచనా. ఎకరానికి ఏడాదికి రూ.60 వేల వరకు చెల్లించి, కనీసం మూడేళ్లపాటు లీజుకు ఒప్పందం చేసుకుంటారు. నీటి సరఫరా భూమి యజమానే సమకూర్చాల్సి ఉంటుంది.
వెయ్యి మందికి ఉపాధి
నర్సరీల్లో సుమారు వెయ్యి మంది ఉపాధి పొందుతున్నారు. ప్రధానం మామిడి మొక్కలకు అంటు కట్టడానికి ఎక్కువ మందికి పని దొరుకుతుంది. దీంతో పాటు ఇతర పనులకు కూడా కూలీలు అవసరమవుతారు. ఏడాదిలో 9 నెలల వరకు దినసరి కూలీలకు ఆయా నర్సరీలు పని కల్పిస్తున్నాయి.
మొక్కల ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది
15 ఏళ్లుగా నర్సరీలు ఏర్పాటు చేసి, మొక్కలు పెంచుతున్నాం. నర్సరీల ఏర్పాటు, మొక్కల ఉత్పత్తికి ప్రతి ఏటా ఖర్చు పెరుగుతుంది. మండలంలో ఆయా నర్సరీల్లో ఏటా 80 లక్షల వరకు మొక్కల కోసం ఏర్పాట్లు చేస్తే, 60 నుంచి 70 శాతం వరకు మాత్రమే మొక్కలు బతుకుతాయి. ఒక్కో మొక్క ఉత్పత్తికి రూ.30 నుంచి 60 వరకు ఖర్చు అవుతుంది. పండ్ల మొక్కలు పెంపకాలతో ప్రజలకు పర్యావరణం, హరితహారం స్ఫూర్తి కలిగిస్తున్న తమను ప్రభుత్వం రాయితీలు అందించి ప్రోత్సహించాలి.
– బానోత్ సైదులు, నర్సరీ యజమాని