ఆంధ్రప్రదేశ్లో సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్ల (జూడాలు) సమస్యలను తక్షణమే పరిష్కరించి, వారు సమ్మె విరమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈ మేరకు సీఎంకు లేఖ రాశారు.
ఆగస్టు 12 నుంచి జూడాలు నాన్-ఎమర్జెన్సీ వైద్య సేవలను బహిష్కరించి ఆందోళన కొనసాగిస్తున్నారని ఈశ్వరయ్య తెలిపారు. స్టైఫండ్ పెంపుపై ప్రభుత్వం, జూడాల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో సమస్య తీవ్రతరమైందన్నారు. ద్రవ్యోల్బణం, పెరిగిన పని భారం, ఎక్కువ గంటల పాటు విధులు నిర్వహిస్తున్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని జీవో నెం.287 ప్రకారం స్టైఫండ్ను 30 శాతం పెంచాలని జూడాలు కోరుతున్నారని పేర్కొన్నారు.
తెలంగాణతో పోలిస్తే ఏపీలో జూనియర్ డాక్టర్లకు అందుతున్న స్టైఫండ్ చాలా తక్కువగా ఉందని ఈశ్వరయ్య తెలిపారు. ప్రభుత్వం ప్రతిపాదించిన పీజీ వైద్య విద్యార్థులకు 3 శాతం, ఇంటర్న్లకు 5 శాతం వార్షిక పెంపును జూడాలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. స్టైఫండ్ పెంపుతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు, వైద్య సిబ్బందికి రక్షణ, మెరుగైన పని వాతావరణం కల్పించాలని కోరుతున్నారని వివరించారు.
ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న జూనియర్ డాక్టర్లు తీవ్ర పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, వారి శ్రమను గుర్తించి తగిన విధంగా స్టైఫండ్ పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
జూడాలు ఐదు రోజులుగా శాంతియుతంగా నిరసన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఆగస్టు 17 నుంచి అత్యవసర సేవలను సైతం బహిష్కరిస్తామని ప్రకటించడం ఆందోళన కలిగిస్తోందని ఈశ్వరయ్య అన్నారు. అత్యవసర వైద్య సేవలు నిలిచిపోతే ప్రభుత్వ ఆసుపత్రులపై ఆధారపడే పేద, మధ్యతరగతి రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే జూడాలతో చర్చలు జరిపి, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. రోగులకు వైద్య సేవలకు అంతరాయం కలగకుండా సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించి జూడాలు సమ్మె విరమించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్కు కూడా లేఖ ప్రతిని పంపించారు.