సత్తుపల్లి టౌన్, డిసెంబర్ 8: నియోజకవర్గంలోని సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లో బీటీ రోడ్ల నిర్మాణం, మరమ్మతుల కోసం రోడ్లు, భవనాల శాఖ నుంచి రూ.70 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. ఈ నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కే, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఈ నిధులతో గ్రామాలను అనుసంధానం చేస్తూ నూతనంగా బీటీ రోడ్ల నిర్మించడంతోపాటు ఇప్పటికే ఉన్న రోడ్లకు మరమ్మతులు చేయనున్నట్లు చెప్పారు.
తల్లాడ నుంచి భద్రాచలం రోడ్డుకు రూ.1.06 కోట్లు, రామానుజవరం నుంచి ముచ్చారం వరకు రూ.1.08 కోట్లు, నర్సింహారావుపేట నుంచి గోపాలపేట రోడ్డుకు రూ.1.03 కోట్లు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి నూతనకల్ వరకు రూ.1.02 కోట్లు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి లోకవరం వరకు రూ.70 లక్షలు, తల్లాడ నుంచి పినపాక రోడ్డుకు రూ.2.05 కోట్లు, మిట్టపల్లి నుంచి పెద్ద కొరుకొండి రోడ్డుకు రూ.1.09 కోట్లు, మల్లవరం నుంచి గంగదేవిపాడుకు రూ.9 కోట్లు, నూకాలంపాడు నుంచి జెన్నారం వరకూ రూ.2.50 కోట్లు, అదే విధంగా కల్లూరు మండలంలో లోకవరం నుంచి పెనుబల్లి రోడ్డుకు, కల్లూరు, బత్తులపల్లి, పుల్లయ్యబంజరు, కప్పలబంధం, బ్రహ్మళ్లకుంట, తాళ్లపెంట గ్రామాల రోడ్డుకు రూ.5.06 కోట్లు, పాయాపూర్ నుంచి పెద్దారం రోడ్డుకు రూ.61 లక్షలు, పెద్దకొరుకొండి నుంచి యర్రంపాడు రోడ్డుకు రూ.2.01 కోట్లు, కల్లూరు నుంచి మచిలీపట్నం రోడ్డుకు రూ.4.08 కోట్లు, పాయాపూర్ నుంచి మునకొల్లు రోడ్డు రూ.4 కోట్లు, పెనుబల్లి మండలంలో అప్రోచ్ నుంచి లంకాసాగర్ రోడ్డుకు రూ.1.09 కోట్లు, బూరుగుగూడెం నుంచి లంకపల్లి రూ.2.01 కోట్లు, సత్తెమ్మగుడి నుంచి వీఎం బంజరు వరకు రూ.2.06 కోట్లు, ఉప్పలచలక, భవన్నపాలెం రోడ్డుకు రూ.1.03 కోట్లు, పెనుబల్లి నుంచి అడసర్లపాడు వరకు రూ.1.01 కోట్లు, వేంసూరు మండలంలో సత్తుపల్లి నుంచి సిద్దారం, సదాశివునిపాలెం, భీమవరం, మర్లపాడు మీదుగా వేంసూరు వరకూ రూ.13.70 కోట్లు, లంకపల్లి నుంచి వేంసూరు రోడ్డుకు రూ.50 లక్షలు, రాయుడుపాలెం నుంచి అమ్మపాలెం రోడ్డు వరకు రూ.1.05 కోట్లు, సత్తుపల్లి మండలంలో కిష్టారం నుంచి పెంట్లం రోడ్డు వరకూ రూ.3.01 కోట్లు, తాళ్లమడ నుంచి లింగాలపల్లి రోడ్డు వరకు రూ.1.08 కోట్లు కలిపి మొత్తం రూ.70 కోట్లతో నూతన బీటీ రహదారులు, మరమ్మతులకు నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు.