భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేశారు. ఆన్లైన్, ఆఫ్లైన్లో పట్టభద్రులు ఓటు హక్కు కోసం చేసుకున్న దరఖాస్తులను స్వీకరించిన అధికారులు ఇంటింటికీ తిరిగి విచారణ చేపట్టి ఓటర్ల తుది జాబితాను రూపొందించారు. పంచాయతీ కార్యదర్శుల ద్వారా విచారణ చేసిన బూత్ లెవల్ ఆఫీసర్లు(బీఎల్వో) దరఖాస్తులు సరైనవి అని తేల్చడంతో జిల్లావ్యాప్తంగా 40,492 దరఖాస్తులు వచ్చినట్లు గుర్తించారు. వీటిలో ఆయా నియోజకవర్గాలవారీగా పరిశీలన పూర్తి చేసిన అధికారులు తుది జాబితాను సిద్ధం చేశారు. మహిళలు 20,900 మంది, పురుషులు 16,026 మంది.. మొత్తం 36,926 మందికి ఓటు హక్కు ఉన్నట్లు గుర్తించిన అధికారులు అధికారికంగా ప్రకటనను వెబ్సైట్లో పొందుపరిచారు. జిల్లావ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులలో వివిధ కారణాలరీత్యా 3,566 మంది దరఖాస్తులను తిరస్కరించగా.. 2,111 మంది దరఖాస్తులను పెండింగ్లో పెట్టారు. పట్టభద్రుల ఓటరు నమోదుకు చివరి తేదీ ముగియడంలో ఆన్లైన్ వెబ్సైట్ను కూడా అధికారులు నిలిపివేశారు.
ఫిబ్రవరి 6వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలకు పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియను ప్రారంభించిన అధికారులు మార్చి 22వ తేదీ వరకు గడువు ఇచ్చారు. అయినా చాలా మంది పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఎందుకనో ఆసక్తి చూపించలేదు. ఓటు హక్కు నమోదుపై విస్తృతంగా ప్రచారం చేయడంతోపాటు అవగాహన కల్పించినా నమోదు శాతం పెరగలేదు. అయితే ఉద్యోగులు, నిరుద్యోగులు ఓటు హక్కుకు అర్హత ఉండి కూడా నమోదు చేసుకోలేదు. ఇందులో అధికారుల అలసత్వం ఉందా.. లేదా ప్రచార లోపమా.. అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లాలో 40 వేలకు మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ.. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఆసక్తి లేకపోవడమా.. లేక ఓటుపై ధన ప్రభావం పడడం వల్లనోగానీ పట్టభద్రులు కొందరు తమ ఓటు హక్కును వినియోగించుకోలేక పోతున్నారు. వెరసి ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల సంఖ్య తగ్గినట్టే అనిపిస్తోంది.
ఎన్నికల సంఘం ఇచ్చిన తేదీల ప్రకారం జిల్లాలో ఎమ్మెల్సీ ఓటర్ల నమోదును పూర్తి చేసిన అధికారులు చకచకా ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. ఈ నెల 4వ తేదీన ఫైనల్ పబ్లికేషన్ ప్రకటన చేయడానికి కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారులు ప్రక్రియను పూర్తి చేసి ఉంచారు. 4న అధికారికంగా కలెక్టర్ ప్రియాంక ఆల జాబితాను ప్రకటించనున్నారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ ఆలస్యమైతే మరోసారి ఓటర్ల నమోదుకు గడువు పెంచుతారా.. లేదా ఇదే ఫైనల్గా ఉం టుందా.. అనేది ఎన్నికల కమిషన్ నిర్ణయాన్నిబట్టి ఉంటుంది.