భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 25 (నమస్తే తెలంగాణ)/సత్తుపల్లి : ఇన్నాళ్లూ సొంతిల్లు లేదని పేద, మధ్యతరగతి ప్రజలు బాధపడ్డారు. కొందరు పూర్వీకులు సంపాదించిన జాగలో కష్టార్జితంతో గుడిసెలు, షెడ్లు వేసుకుని కాలం వెళ్లదీశారు. గోడలు, తలుపులు, కిటికీలు, పైకప్పులు సరిగా లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కుటుంబాలను పోషించుకోవడానికే ఇబ్బంది పడే పేదలు ఇల్లు కట్టుకోవడమంటే సాధ్యమయ్యే పని కాదు. అలాంటి అభాగ్యుల కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. ఇప్పటికే వేలాది మందికి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చిన సర్కార్ త్వరలో సొంత జాగ ఉన్న వారూ ఇల్లు కట్టుకునేందుకు ‘గృహలక్ష్మి’ పథకం ద్వారా రూ.3 లక్షలు అందివ్వనున్నది. పేదల సొంతింటి కలను సాకారం చేయనున్నది.
ఖాళీ జాగా ఉన్న నిరుపేదల కోసం ఇంటి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని తెచ్చింది. రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని పూర్తి రాయితీతో అందించే పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి విధివిధానాలను ప్రభుత్వం విడుదల చేయడంతో నిరుపేద వర్గాల్లో హర్షం వ్యక్తమవుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇండ్లు లేని నిరుపేదల కోసం డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి వేలాది మందికి పంపిణీ చేసింది. అంతటితో సరిపెట్టుకోకుండా సొంత జాగలో ఇళ్లు నిర్మించుకునే వారిని ప్రోత్సహించేందుకు గృహలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు పథకాన్ని వర్తింపజేసే ప్రక్రియ అంతా కలెక్టర్ల నేతృత్వంలోనే జరుగనున్నది. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి ఆమోదంతోనే ఎంపిక చేసిన లబ్ధిదారుడికి సాయం అందుతుంది. మూడు దశల్లో రూ.3 లక్షల సాయాన్ని లబ్ధిదారురాలి బ్యాంకు ఖాతాలో జమ చేసే విధంగా ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా.. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా గృహలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం అమలు చేయబోతున్నది.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 30 వేల మంది లబ్ధిదారులు..
ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 3వేల మందికి గృహలక్ష్మి సాయాన్ని అందజేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రెండు జిల్లాలవ్యాప్తంగా 15 వేల మందికి ప్రయోజనం చేకూరనున్నది. ఒకవేళ ఇంతకన్నా ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటే వారికి మరో విడతలో సాయం అందజేయనున్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల ద్వారా వచ్చిన దరఖాస్తులను కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి అర్హులకు సాయం అందించేలా చర్యలు తీసుకుంటుంది. అయితే ఇల్ల్లు, జాగ లేని వారికి ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేసిన విషయం విదితమే. ఈ పథకం ద్వారా గ్రామాలు, పట్టణాల్లో వేల సంఖ్యలో మంజూరు చేసిన డబుల్ బెడ్రూం ఇళ్లతో వేలాది మందికి ఇప్పటికే లబ్ధి చేకూరింది.
లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత..
ఎలాంటి అవినీతి అక్రమాలకు ఆస్కారం లేకుండా గృహలక్ష్మి పథకాన్ని ఆన్లైన్ ఆధారితంగానే అమలు చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పర్యవేక్షణలో గృహలక్ష్మి పేరుతో ప్రత్యేకంగా పోర్టల్ను తీసుకురానున్నది. మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది. జిల్లాలవారీగా ప్రజల నుంచి దరఖాస్తులు ఆహ్వానించి అధికారులు రూపొందించిన అర్హుల జాబితాను కలెక్టర్ నిర్ణయిస్తారు. దశలవారీగా జిల్లాకు చెందిన మంత్రి ఇళ్లు మం జూరు చేస్తారు. ఇంటి నిర్మాణాన్ని మాత్రం లబ్ధిదారురాలు ఇష్టపూర్వకంగా ఎలాగైనా కట్టించుకోవచ్చు. ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, బ్యాంకు అకౌంట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. జీవో నెంబర్ 59 ద్వారా లబ్ధి పొందిన వారు, ఆర్సీసీ రూఫ్తో ఇల్లు ఉన్న వారిని అనర్హులుగా పరిగణిస్తారు. ప్రతీ నియోజకవర్గంలో ఎస్సీలు 20 శాతం, ఎస్టీలు 10 శాతం, బీసీ, మైనార్టీలు కలిపి 50 శాతం ఉండేలా చూడనున్నారు.
సొంతింటి కల నెరవేర్చడం కోసం&
2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో సొంతింటి జాగ ఉన్న వారికి ఫైనాన్షియల్ సపోర్టు కల్పిస్తామని హామీ ఇచ్చింది. రూ.3 లక్షల వరకు ప్రభుత్వమే డబ్బులు అందించడం ద్వారా లబ్ధిదారు తనకు ఇష్టమైన రీతిలో సొంతింటిని కట్టుకోవచ్చని బీఆర్ఎస్ పార్టీ హామీల్లో స్పష్టంగా పేర్కొంది. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం సొంతింటి నిర్మాణానికి ఆర్థిక భరోసా కల్పించే పథకాన్ని అమలు చేయబోతున్నది. గ్రామాల్లో చాలా మందికి ఇల్లు నిర్మించుకోవడానికి జాగ అందుబాటులో ఉంటుంది. కానీ.. ఇంటి నిర్మాణానికి లక్షలు పెట్టుబడి పెట్టే స్తోమత ఉండదు. అలాంటి వారికి సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన గృహలక్ష్మి పథకం ఎంతగానో ఉపయోగపడనున్నది. ప్రభుత్వం కొంత ఆర్థిక చేయూత కల్పించడం ద్వారా మిగిలిన సొమ్మును లబ్ధిదారులే కలుపుకొని సొంతిల్లు నిర్మించుకునేందుకు అవకాశం లభించనున్నది.
చిన్న రేకుల షెడ్ వేసుకున్నాం..
మాకు సొంత ఇల్లు లేకపోవడంతో రేకుల షెడ్లో ఉంటున్నాం. సీఎం కేసీఆర్ సొంత ఇంటి కలను నెరవేర్చుతున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. స్థలం ఉన్న చోటే ఇల్లు కట్టుకునే అవకాశం కలిగింది. ఎక్కడో డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చినా అక్కడ ఎలా ఉండాలో అని చాలా భయమేసింది. గృహలక్ష్మి పథకంతో ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది.
– బండారి జయమ్మ, గ్రామస్తురాలు, తిప్పనపల్లి, చండ్రుగొండ మండలం
నిరుపేదలకు అండగా గృహలక్ష్మి ..
గూడులేని నిరుపేదలకు ప్రభుత్వం గృహలక్ష్మి పథకంతో అండగా నిలుస్తుంది. దీంతో మాలాంటి పేదవాళ్లకు కొండంత ధైర్యం వచ్చింది. స్థలం ఉన్నా ఆర్ధికస్థోమత లేక ఇల్లు కట్టుకోలేకపోయాం. స్థలం ఉన్న వారు ఇల్లు కట్టుకోవడానికి ప్రభు త్వం రూ.3లక్షలు సాయం ప్రకటించడం సంతోషం. ఉన్న స్థలంలో ఈ సాయంతో ఇల్లు కట్టుకుంటాం. పేదలకు ఈ పథకం వరం. గృహలక్ష్మి పథకం అమలు చేస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– వల్లెపు లక్ష్మి, కాకర్లపల్లి, సత్తుపల్లి మండలం
ఇల్లు కట్టుకోవాలని ఉంది..
గృహలక్ష్మి పథకంతో ఇల్ల్లు కట్టుకునే అవకాశం కలగబోతున్నది. ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇంటిని మంజూరు చేస్తామని ప్రకటించింది. కానీ. మాకు లాటరీలో రాలేదు. ఇప్పుడు ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు ఇస్తాననడం సం తోషాన్నిచ్చింది. ఈ ప్రకటన పేదల్లో భరోసా నింపింది.
– పొగాకు నర్మద, గ్రామస్తురాలు, చినబండిరేవు, దుమ్మగూడెం మండలం
పథకం పేదోళ్లకు వరం..
గృహలక్ష్మి పథకం ద్వారా ఇల్లు కట్టుకోవడానికిప్రభుత్వం రూ.3 లక్షల సాయం అందిస్తుందని తెలిసి సంతోషపడ్డాం. మాలాం టి ఇల్లు లేని పేదోళ్లకు గూడు నిర్మించుకోవడానికి సాయం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రుణం తీర్చుకోలేం. ఇంటి నిర్మాణం కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తు న్నాం. ప్రభుత్వ సాయంతో సొంతింటి కలను నిజం చేసుకుంటాం.
– కృష్ణవేణి,రామానగరం, సత్తుపల్లి మండలం