భద్రాచలం, డిసెంబర్ 28: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో వచ్చే నెల 3 నుంచి 23 వరకు శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలను నిర్వహించనున్నారు. జనవరి 12న తెప్పోత్సవం, 13న ఉత్తర ద్వార దర్శనం వేడుకలను వైభవంగా జరుపుతారు. జనవరి 3 నుంచి భద్రాద్రి రామయ్య రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. మంగళవారం ఎండోమెంట్ కమిషనర్ అనీల్కుమార్, భద్రాచలం దేవస్థానం ఈవో శివాజీ, ఆలయ అర్చకులు హైదరాబాద్ వెళ్లి దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డిని కలిశారు. ఉత్సవాలకు హాజరుకావాల్సిందిగా ఆహ్వానించారు. ఆహ్వాన పత్రికను అందజేశారు. అదేవిధంగా మంత్రి అజయ్కుమార్, మహబాద్ ఎంపీ కవితను కూడా ఆహ్వానించారు. అనంతరం ఉత్సవాల పోస్టర్, ఆహ్వాన పత్రికలను ఆవిష్కరింపజేశారు. దేవస్థాన అర్చకులు మంత్రికి వేదాశీర్వచనం చేశారు. రామయ్య ప్రసాదాలను, శేష వస్ర్తాలను అందజేశారు. ఈ సందర్భంగా ముక్కోటి ఏర్పాట్ల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేయాలని, కొవిడ్ మార్గదర్శకాలను అమలు చేయాలని సూచించారు. దేవస్థాన ఈవో సీసీ అనీల్కుమార్, ఉప ప్రధానార్చకులు గోపాలకృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
3 నుంచి నిత్యకల్యాణాల నిలిపివేత
భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో జనవరి 3 నుంచి 13 వరకు రామయ్యకు నిత్య కల్యాణాలను నిలిపివేస్తున్నట్లు దేవస్థానం ఈవో శివాజీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.