హెల్మెట్ వినియోగంపై వాహనదారులకు పోలీసుల అవగాహన
ముమ్మరంగా తనిఖీలు
నిబంధనలు విస్మరిస్తున్న వారికి జరిమానాలు
దస్తురాబాద్, డిసెంబర్ 26 : ద్విచక్ర వాహ నం లేనిదే బయటకు వెళ్లలేని పరిస్థితి. జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదాలు కూడా ఎక్కువే. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు, అతి వేగంగా వాహనాలు నడిపినప్పుడు ప్రమాదా లు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి చేసింది. పోలీసులు కూడళ్లు, ప్రధాన రహదారులపై ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. హెల్మెట్ లేని వారికి జరిమానాలు విధిస్తున్నారు. ప్రమాద సమయాల్లో తలకు గాయాలవ్వకుండా హెల్మెట్ కాపాడుతుంది. ప్రాణాపాయం నుంచి బయట పడవచ్చు. దుమ్ము, ధూళి, ఎండ నుంచి రక్షిస్తుంది. తిరిగి క్షేమంగా ఇంటికి చేరేలా ఉపయోగపడుతుంది. ప్రమాదాల నేపథ్యంలో హెల్మెట్ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.
వాహనదారుల్లో మార్పు…
వాహనదారుడి ప్రాణ రక్షణకు హెల్మెట్ నిబంధనను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. హెల్మెట్ లేకుండా పట్టుబడితే జరిమానా వేస్తున్నారు. కొంత మంది యువకులు హెల్మెట్ను భారంగా భావిస్తున్నారు. హెల్మెట్ లేని కారణంగా కొంత మంది యువకులు ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ ప్రమాదాల్లో ఎక్కువగా యువకులే ఉంటున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారికి జరిమానాలు విధించడంతో పాటు వారితో హెల్మెట్లు కొనిపిస్తున్నారు.
వాహనాల తనిఖీ
ఎస్ఐ జ్యోతిమణి ఆధ్వర్యంలో మండలం లోని రేవోజిపేట-గొడి సెర్యాల ఎక్స్ రోడ్డు వద్ద పోలీసులు ఆదివారం వాహనాల తనిఖీ, డ్రంకన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్రువీకరణ పత్రాలు లేని వాహనదారులకు జరిమానా విధించారు. వాహనాలపై పెండింగ్లో ఉన్న జరిమానాలను కూడా వాహనదారులతో కట్టించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ భీంరావు, సిబ్బంది మల్లేశ్ పాల్గొన్నారు.
రక్షణగా భావించాలి..
ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ను మన రక్షణ పరికరంగా భావించాలి. పోలీసులు పట్టుకుంటారని భావించవద్దు. అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ ప్రాణాపాయం నుంచి కాపాడుతుంది. వాహనదారులు కచ్చితంగా నిబంధనలను పాటించాలి. విస్మరిస్తే చర్యలు తప్పవు. నిత్యం వాహనాల తనిఖీ చేస్తూ చర్యలు తీసుకుంంటున్నాం. ప్రజాప్రతినిధులు, నాయకులు,యువజన సంఘాల బాధ్యులు హెల్మెట్ వాడకంపై మరింత చైతన్యం పెంపొందించాలి. గ్రామాల్లో కూడా అవగాహన కల్పిస్తున్నాం.
జ్యోతిమణి, ఎస్ఐ, దస్తురాబాద్