రెండు విడతలుగా సీబీఎస్ఈ పరీక్షలు
నేటి నుంచే సెమిస్టర్-1
నూతన విధానానికి నాంది పలికిన సీబీఎస్ఈ
ఖమ్మం ఎడ్యుకేషన్, నవంబర్26 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పరీక్షలో నూతన విధానానికి నాంది పలికింది. సగం సిలబస్ను ప్రామాణికంగా తీసుకొని సెమిస్టర్-1, సెమిస్టర్-2గా విభజించింది. మొదటి సెమిస్టర్ పరీక్ష ప్రారంభమైన రోజే ఆ పేపర్ మదింపు జరిగేలా విధివిధానాలను రూపొందించింది. అంతేకాదు, ఆ పేపర్ మూల్యాంకనానికి సంబంధించిన పూర్తి డేటాను అదేరోజు బోర్డుకు పంపించాలని సర్క్యులర్లో పేర్కొంది. ఆ దిశగా సీబీఎస్ఈ కమిటీ అన్ని ఏర్పాట్లూ చేసింది. ఈ మేరకు ఈ నెల 27న మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రెండో సెమిస్టర్ పరీక్షలు మార్చిలో జరుగనున్నాయి. రెండు విడతల మార్కులను కలపడం ద్వారా తుది ఫలితం ప్రకటించే అవకాశం ఉంది.
పరీక్ష జరిగిన రోజే మూల్యాంకనం
పరీక్ష ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు. పరీక్ష పూర్తైన తర్వాత సాయంత్రం 4 గంటల వరకు సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రక్రియ పూర్తి చేయాలి. ఇందుకోసం పరీక్ష కేంద్రంలో ఉన్న టీచర్లతోపాటు ఆ పరిధిలోని సీబీఎస్ఈ పాఠశాలలో బోధిస్తున్న టీచర్లను వినియోగించుకోవచ్చు. సమాధాన పత్రాలను మూల్యాంకనం చేసేందుకు సీబీఎస్ఈ బోర్డు ‘కీ’ని అందజేస్తుంది. సమాధాన పత్రాల మూల్యాంకనం ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటలలోగా సీబీఎస్ఈ బోర్డులో ఎన్ని సమాధానాలు కరెక్ట్ అనే వివరాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేరోజు సాయంత్రం 5 గంటల వరకు సమాధాన పత్రాలను పోస్టాఫీస్లో అందజేయాలి.
ఆన్లైన్లో ప్రశ్నాపత్రం..
సెమిస్టర్ విధానంలో ఇప్పటివరకు డిగ్రీ, ఆపై పీజీ కోర్సుల్లో మాత్రమే పరీక్షలు నిర్వహించారు. తొలిసారిగా సీబీఎస్ఈ బోర్డు టెన్త్లో ప్రవేశపెట్టింది. డిగ్రీ వంటి సాధారణ కోర్సులతోపాటు ఇంజినీరింగ్ వంటి సాంకేతిక కోర్సుల్లో అమలవుతున్న విధానాలనే దీనిలో అమలు చేస్తున్నది. ప్రశ్నాపత్రాలను సంబంధిత పరీక్షాకేంద్రాల్లో ప్రింట్ తీసుకునేలా ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతున్నది. నిర్దేశించిన పరీక్ష సమయానికి ప్రశ్నాపత్రాన్ని సీబీఎస్ఈ బోర్డు నియమించిన అబ్జర్వర్ పర్యవేక్షణలో డౌన్లోడ్ చేయాలి. ఈ పరీక్షలకు ఇతర జిల్లాల్లోని సీబీఎస్ఈ పాఠశాలల ప్రిన్సిపాల్స్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తుంటారు. 40 మార్కులకు మొదటి సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరో సెమిస్టర్లో 40 మార్కులకు మొత్తం 80 మార్కులకు సెమిస్టర్ విధానంలో పరీక్షలు నిర్వహించడంతోపాటు 20 మార్కులను స్కూల్లో ఇంటర్నల్ మార్కులుగా కేటాయిస్తారు.