అశ్వారావుపేట, సెప్టెంబర్ 26: ఎరువుల విక్రయాల్లో పారదర్శకత పెంచేందుకు, అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. వ్యవసాయ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి నకిలీ విత్తనాలు, బ్లాక్ మార్కెట్కు ఎరువులు తరలింపు, అధిక ధరలకు ఎరువులు, విత్తనాల విక్రయం వంటి ఇబ్బందులను రైతులు ఎదుర్కొంటున్నట్లు గుర్తించిన సర్కార్ పీడీ యాక్ట్ అమలు చేస్తున్నది. అయినా కొందరు అక్రమార్కులు దందా నడిపిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం చెక్ పెట్టేందుకు ‘పాయింట్ ఆఫ్ సేల్ మిషన్'(పీవోఎస్ యంత్రం) వినియోగించాలని నిర్ణయించింది. ప్రతి ఎరువుల దుకాణదారుడు పీవోఎస్ ద్వారానే ఎరువులు విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది.
విధానం ఇలా..
ప్రతి దుకాణదారుడు ఈ పద్ధతిలోనే విక్రయాలు జరిపే విధంగా చర్యలు తీసుకుంటున్నది. ఈ పద్ధతిలో ఒక వ్యాపారి ఎన్ని టన్నుల ఎరువులు విక్రయించిన వివరాలు ప్రభుత్వానికి తెలిసే అవకాశం ఉంటుంది. రైతు ఎరువులు కొనే సమయంలో తప్పనిసరిగా ఆధార్ నెంబర్ చెప్పాల్సి ఉంటుంది. పీవోఎస్ యంత్రంలో ఆధార్ నమోదు చేయగానే ఫోన్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని యంత్రంలో నమోదు చేసినప్పుడే ఎరువులు విక్రయించాల్సి ఉంటుంది. ఇలా ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలించేందుకు అవకాశం లేకుండా ప్రభుత్వం కట్టడి చేస్తున్నది. రైతులకూ బ్లాక్ మార్కెట్లో అధిక ధరలు వెచ్చించి ఎరువులు కొనే బాధ తప్పింది. హోల్ సేల్ వ్యాపారి నుంచి రిటైల్ వ్యాపారికి చేరిన ఎరువుల నిల్వతో పాటు విక్రయించిన పూర్తి వివరాలు ‘ఊర్వ్’ గూగుల్ యాప్లో డీలర్ ఐడీ నెంబర్ ఎంటర్ చేస్తే దుకాణంలో ఉన్న స్టాక్ వివరాలు తెలుస్తాయి. ఫలితంగా బ్లాక్ మార్కెట్కు అవకాశమే ఉండదు.
రెండు సీజన్లలో 20 వేల మెట్రిక్ టన్నులు
జిల్లాలో ఏటా రైతులు రెండు సీజన్లు కలిపి సుమారు 20 వేల మెట్రిక్ టన్నుల ఎరువులను వినియోగిస్తున్నారు. వానకాలంలో 16 వేల మెట్రిక్ టన్నులు, యాసంగిలో 4 వేల మెట్రిక్ టన్నుల వినియోగం ఉన్నది. 2 వేలకు పైగా దుకాణాల ద్వారా ఎరువుల విక్రయాలు జరుగుతున్నాయి. యాసంగి కంటే వానకాలం సీజన్లోనే ఎరువుల విక్రయం ఎక్కువగా ఉంటుంది. యాసంగిలో బోర్ల కిందనే పంటల సాగు జరుగుతుంది కాబట్టి ఎరువుల విక్రయం తక్కువగా ఉంటుంది.
ఎరువుల విక్రయాల్లో పారదర్శకత..
ఎరువుల విక్రయాల్లో పారదర్శకతకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. బ్లాక్ మార్కెట్ దందా నియంత్రణకు పీవోఎస్ల ద్వారా అమ్మకాలు చేపడుతున్నది. ప్రతి ఎరువుల దుకాణ యజమాని పీవోఎస్ యంత్రాల ద్వారానే విక్రయాలు జరపాలి. దీనివల్ల దుకాణాల్లో ఎరువుల నిల్వలు ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుంది. బ్లాక్ మార్కెట్కు తరలించేందుకు అవకాశం ఉండదు. రైతులూ అధిక ధరలకు ఎరువులు కొనుగోలు చేసే సమస్య ఉత్పన్నం కాదు.