కలెక్టర్ వీపీ గౌతమ్
మామిళ్లగూడెం, సెప్టెంబర్ 25 : ధరణి పెండింగ్ స్లాట్స్ పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వీపీ గౌతమ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ధరణి పెండింగ్ స్లాట్స్(జీఎల్ఎం) గ్రీవెన్స్ ఆఫ్ ల్యాండ్ మ్యాటర్స్, పీఓబీ, కోర్టు కేసులు ఇతర భూ సమస్యల పెండింగ్ అంశాలపై కలెక్టర్ మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం భూ సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చిందని, తహసీల్దార్లకు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హోదా కల్పించి రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు బాధ్యత అప్పగించిందని, వాటిని విస్మరించకుండా విధి నిర్వహణ ఉండాలని సూ ంచారు. నూతన చట్టం, నిబంధనలు అమల్లోకి వచ్చాయని, పాత పద్ధతులకు స్వస్తి పలకాలని, భూ సమస్యలకు సంబంధించిన ఏ ఒక్క ఫైల్ తహసీల్దార్ల వద్ద పెండింగ్లో ఉండరాదని తెలిపారు. జిల్లాలో ధరణి స్లాట్స్ రిజిస్టేషన్లపై ఎటువంటి ఫిర్యాదు రాకూడదని, స్లాట్ బుకింగ్ చేసుకున్నవారి నుంచి ఫిర్యాదులు అందితే బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఆర్డీవోలు పెండింగ్ పనులపై నిరంతరం పర్యవేక్షించాలని అధికారులతో దరఖాస్తుదారులతో చర్చించి పెండింగ్ సమస్యలు సత్వరం పరిష్కరించి చర్యలు తీసుకోవాలని ఆర్డీవోలను ఆదేశించారు. మీ-సేవ సెంటర్లను తనిఖీ చేయాలని, ప్రజల నుంచి అధిక రుసుం వసూలు చేసేవారిపై చర్యలు తప్పవని పేర్కొన్నారు. ప్రైవేట్ స్థలాల్లో ఉన్న నర్సరీలను ప్రభుత్వ స్థలాల్లోకి మార్చేందుకు అనువైన ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి సంబంధిత అధికారులకు అప్పగించాలన్నారు. భవిష్యత్ నర్సరీ నిర్వహణకు దృష్టిలో ఉంచుకుని ఎక్కువ విస్తీర్ణం కలిగిన స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. తిరుమలాయపాలెం, రఘునాథపాలెంలో నర్సరీలకు మూడు రోజుల్లో స్థలాలను ఎంపిక చేయాలని ఆదేశించారు. బృహత్ పల్లెప్రకృతి వనాలకు అవసరమైన ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. జిల్లాలో ఆయిల్ ఫామ్ నర్సరీ, ఫ్యాక్టరీ ఏర్పాటుకు కనీసం 80 నుంచి 100 ఎకరాలలోపు ఉన్న స్థలాన్ని గుర్తించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, డీఆర్వో శిరీష, ల్యాండ్ సర్వే ఏడీ రాము, కలెక్టరేట్ కార్యాలయ ఏవో మదన్గోపాల్, ఆర్డీవోలు రవీంద్రనాథ్, తహసీల్దార్లు పాల్గొన్నారు.