రైతుబజార్లో కిలో రూ.86, రిటైల్లో కిలో రూ.100
కూరగాయల ధరలకు రెక్కలు
ఆంధ్రాలో భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలు
ఖమ్మం వ్యవసాయం/ కొత్తగూడెం కల్చరల్/ కూసుమంచి, నవంబర్ 24: టమాటా పంటది చిత్రమైన స్వభావం. ఒక సీజన్లో సాగు చేసిన రైతుకు కన్నీరు తెప్పిస్తుంది. మరో సమయంలో వినియోగదారుల ఇంట్లో కంటతడికి కారణమవుతుంది. మార్కెట్లో టమాటా ధర రోజురోజుకూ పెరగడమే తప్ప.. తగ్గడం అనే అవకాశమే లేకుండా దూసుకెళ్తోంది. ఈ నెల ప్రారంభంలో రూ.40 దగ్గర మొదలైన పెరుగుదల రోజుల వ్యవధిలోనే రూ.100 దాటింది. రైతుబజార్లు, హోల్సేల్ మార్కెట్లలో కేజీ రూ.86 చొప్పున ఉంటుండగా.. రిటైల్ షాపుల్లో కేజీ రూ.110 వరకూ పలుకుతోంది. ఇంచుమించు అదే దారిలో ఇతర కూరగాయల ధరలు పెరిగాయి.
టమాటా లేని వంటగది..
ఇప్పటి వరకూ టమాటా కూర లేని ఇల్లు ఉండేది కాదు. కానీ ఇప్పుడు వంట గదిలో టమాటా ఉండడం లేదు. టమాటా కూర, టమాటా పచ్చడి, టమాటా ఒరుగులు, టమాటా చారు అంటూ రకరకాల వంటలు చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంతకూ తప్పకపోతే అరకిలో, పావుకిలో చొప్పున కొని సరిపెట్టుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది టమాటా ఉత్పత్తి గణనీయంగా తగ్గడం, ఆంధ్రాలో కురిసిన అతి భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని దిగుమతి నిలిచిపోవడం వంటివి ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఇంతకుముందు కూరగాయల దగ్గర బేరమాడే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ముందుగానే బోర్డులు రాసి పెడుతున్నారు.
అదే దారిలో మిగతా కూరగాయల ధరలు..
టమాటా ధరల దారిలోనే మిగిలిన కూరగాయల ధరలూ పరుగులు పెడుతున్నాయి. చలికాలంలో దాదాపు అన్ని రకాల కూరగాయల ధరలూ తగ్గాల్సింది పోయి పెరుగుతున్నాయి. బుధవారం ఖమ్మం సమీకృత రైతుబజారులో కిలో చొప్పున కూరగాయ ధరలు ఇలా ఉన్నాయి. టమాటా రూ.86, పచ్చిమిర్చి రూ.56, చిక్కుడు రూ.80, గోరు చిక్కుడు రూ.50, క్యాబేజీ రూ.28, వంకాయ రూ.46, కాకరకాయ రూ.40, బెండకాయ రూ.50, కంచె కాకర రూ.44, బీరకాయ రూ.50, సొరకాయ రూ.30, దొండకాయ రూ.46, పొట్లకాయ రూ.46, నాటు దోస కాయ రూ.46, ఆలుగడ్డ రూ.28, చామగడ్డ రూ.36, బీట్రూట్ రూ.64, మూడు ఆకుకూర కట్టలు రూ.20, ఉల్లిగడ్డ రూ.50, కొత్తిమీర, పుదీనా కట్ట రూ.30.
మరికొద్ది రోజుల్లో స్థానిక పంటలు చేతికొస్తాయి..
జిల్లాలో కొత్తగా సాగు చేసిన టమాటా పంట మరో 20 30 రోజుల్లో చేతికి వచ్చే అవకాశం ఉంది. దీంతో కొంత మేర ధరలు తగ్గుతాయి. నిరుడు మిర్చి పంటకు అధిక ధర ఉండడంతో ఈ ఏడాది ఉద్యాన రైతులందరూ ఎక్కువ మొత్తంలో మిర్చి పంట వైపు మళ్లారు. దీనికి తోడు గతంలో కురిసిన భారీ వర్షాల వల్ల చేతికొచ్చిన టమాటా తోటలు నేలపాలయ్యాయి. అయినప్పటికీ రైతులు కొద్ది నెలల క్రితం జిల్లా వ్యాప్తంగా 400 ఎకరాల్లో టమాటా సాగు చేశారు. ప్రస్తుతం పూత, పిందె దశ కొనసాగుతోంది.