టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలి
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి
వైరా, నవంబర్ 24: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుసూదన్ గెలుపు నల్లేరు మీద నడకేనని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు. వైరా నియోజకవర్గంలోని మున్సిపల్ కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలతో స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి పార్టీ అభ్యర్థి తాతా మధుసూదన్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థి మనకు పోటీయే కాదని స్పష్టం చేశారు. మొత్తం 769 మంది ఓటర్లలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే 547 మంది ఉన్నారన్నారు. కాంగ్రెస్కు 147 ఓట్లు, ఇతరులకు మిగిలిన ఓట్లు ఉన్నట్లు చెప్పారు. అయినప్పటికీ తేలిగ్గా తీసుకోకుండా అప్రమత్తంగా ఉంచాలని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో, నిధుల్లో భాగస్వామ్యం లేక జడ్పీటీసీ, ఎంపీటీసీలు సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తమకు తెలుసని, వారితోపాటు మున్సిపల్ కౌన్సిలర్లకు కూడా నిధులు, విధుల్లో భాగస్వామ్యం కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని అన్నారు. మరికొద్దిరోజుల్లోనే అది కార్యరూపంలోకి వస్తుందని వివరించారు. అభ్యర్థి తాతా మధు మాట్లాడుతూ తాను వైరా అల్లుడినని అన్నారు. ఇక్కడి ప్రజాప్రతినిధులు తనను ఆదరించాలని కోరారు. వైరా నియోజకవర్గంలో ఏకపక్షంగా టీఆర్ఎస్కు మెజార్టీ వస్తుందని అన్నారు. ఎమ్మెల్యే రాములునాయక్ మాట్లాడుతూ తాతా మధు గెలుపులో వైరా నియోజకవర్గం కీలకంగా ఉంటుందని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాణాల వెంకటేశ్వరరావు, నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.