5లోగా లబ్ధిదారులను గుర్తించాలి
నియోజకవర్గానికి 100 మంది జాబితా రూపొందించాలి
మంత్రి ఆమోదం తీసుకొని మార్చి 7లోగా గ్రౌండింగ్ చేయాలి
ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్
మామిళ్లగూడెం, జనవరి 24: ఖమ్మం జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి వంద కుటుంబాల చొప్పున ఫిబ్రవరి 5వ తేదీలోగా దళితబంధు లభ్ధిదారులను గుర్తించి జాబితాలను సిద్ధం చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. దళితబంధు పథకంపై రెవెన్యూ, సంక్షేమ శాఖల అధికారులతో సోమవారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. లబ్ధిదారుల ఎంపికపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల శాసనసభ్యులు ఎంపిక చేసిన మేరకు నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున దళితబంధు లబ్ధిదారుల జాబితాను జిల్లా మంత్రితో ఆమోదింపజేసుకోవాలన్నారు. ఆ తరువాత మార్చి 7 నాటికి యూనిట్లు గ్రౌండింగ్ అయ్యేలా సత్వర చర్యలు చేపట్టాలన్నారు. దళితబంధు లబ్ధిదారుల ఎంపిక ప్రభుత్వ నిబంధనలు, మార్గదర్శకాల మేరకు జరగాలని సూచించారు. చింతకాని మండలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎంపిక చేసినందున ఆ మండలంలోని ప్రతి లబ్ధిదారుడికీ దళితబంధు వర్తిస్తుందన్నారు. మధిక నియోజకవర్గానికి సంబంధించి మిగిలిన నాలుగు మండలాల్లో వందమంది కుటుంబాలను ఎంపిక చేయాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు.
వ్యాక్సినేషన్, జ్వర సర్వేపై సమీక్ష
జిల్లాలో జరుగుతున్న ఇంటింటి జ్వర సర్వే ద్వారా ప్రజల ఆరోగ్య రక్షణ, వైద్య సేవల వినియోగంపై అవగాహన, భరోసా కల్పించాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ వైద్యాధికారులను ఆదేశించారు. రెండో డోసు వ్యాక్సినేషన్, కొవిడ్ టెస్టులు, ఇంటింటి జ్వర సర్వే తదితర అంశాలపై సోమవారం తన చాంబర్లో జరిగిన కొవిడ్ కోర్ కమిటీ సమావేశంలో వైదాధికారులతో సమీక్షించారు. ఇంటింటి జ్వర సర్వేకు వెళ్లే వైద్య బృందాలు, కొవిడ్ లక్షణాలు కలిగిన వారికి హోం ఐసొలేషన్ కిట్లు అందించాలని, సమయానికి మందులు వాడి త్వరగా కోలుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. పీహెచ్సీలో కొవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్యను మరింత పెంచాలని, లక్షణాలు కలిగిన వారికి తప్పనిసరిగా టెస్టులు చేయాలని సూచించారు. జ్వర సర్వేకు వెళ్లే బృందాలకు ఎన్-95, సర్జికల్ మాస్కులను తప్పనిసరిగా అందించాలన్నారు. జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆసుపత్రుల్లో అడ్మిషన్ల సంఖ్య ఎకువగా లేదన్నారు. అయినప్పటికీ ముందస్తుగా జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితోపాటు ఏరియా ఆసుపత్రుల్లో అవసరమైన బెడ్లు, ఇంజెక్షన్లు, ఆక్సిజన్ సిలిండర్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఖమ్మంలోని శారద ఇంజినీరింగ్ కళాశాల, వైటీసీ భవనాల్లో క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటుకు ముందస్తు చర్యలు చేపట్టి సిద్ధంగా ఉంచాలన్నారు. సెకండ్, బూస్టర్ డోస్ల వ్యాక్సినేషన్ లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. టీకాల డేటాను రోజూ ఆన్లైన్లో అప్డేట్ చేయాలని సూచించారు. కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణ కలెక్టర్ బీ.రాహుల్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్వో) డాక్టర్ మాలతి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బీ.వెంకటేశ్వర్లు, జిల్లా సర్వేలెన్స్ అధికారి డాక్టర్ రాజేశ్, కేఎంసీ అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, డాక్టర్ సైదులు, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి కే.సత్యనారాయణ, జడ్పీ సీఈవో వీవీ అప్పారావు, ఆర్డీవోలు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, సీపీవో శ్రీనివాస్, ఎల్డీఎం చంద్రశేఖర్రావు పాల్గొన్నారు.