ఈ పథకంతో పేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గింది
చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే రాములునాయక్
కారేపల్లి, జనవరి 24: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలు పేదలకు వరం లాంటివని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పథకాలతో ఆడ పిల్లల పెళ్లిళ్లు చేసే పేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గిందని గుర్తుచేశారు. కారేపల్లి వైఎస్ఎన్ గార్డెన్లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 93 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, 8 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పథకాలన్నీ పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నాయని అన్నారు. ఆడపిల్లల పెళ్లిళ్లు చేసేందుకు తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో కరోనా సంక్షోభంలోనూ సీఎం కేసీఆర్ ఈ పథకాలకు వెనువెంటనే నిధులు విడుదల చేశారని అన్నారు. దేశంలోని బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు తీవ్ర కరెంట్ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే తెలంగాణ ప్రభు త్వం మాత్రం నాణ్యమైన కరెంటును నిరాటంకంగా అందిస్తోందని వివరించారు. ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, ఎంపీపీ మాలోత్ శకుంతల, జడ్పీటీసీ వాంకుడోత్ జగన్, వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గుగులోత్ శ్రీను, సింగరేణి సర్పంచ్ ఆదెర్ల స్రవంతి, టీఆర్ఎస్ నాయకులు తోటకూరి రాంబాబు, అజ్మీరా వీరన్న, ఎండీ హనీఫ్, తహసీల్దార్ కోట రవికుమార్, పంచాయతీ కార్యదర్శి తిలక్ కిశోర్ పాల్గొన్నారు.