ప్రజల హక్కులకు భంగం వాటిల్లొద్దు..
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
రాష్ట్ర ఆహార భద్రత కమిటీ చైర్మన్ తిరుమలరెడ్డి
కొత్తగూడెంలో అధికారులతో సమీక్ష
కొత్తగూడెం, అక్టోబర్ 23: ఆహార భద్రతా చట్టాన్ని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఆహార భద్రతా కమిటీ చైర్మన్ తిరుమలరెడ్డి సూచించారు. కొత్తగూడెం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, పౌర సరఫరాల సంస్థ అధికారులు, డీఆర్డీవో, డీఈవో, ఐసీడీఎస్, వైద్య, మున్సిపల్ కమిషనర్లు, ఫుడ్ ఇన్స్పెక్టర్, ఎంపీడీవోలతో ఆహార భద్రతా చట్టంపై శనివారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఆహార భద్రత చట్టం అమలు తీరును పరిశీలించేందుకు రెండురోజుల పాటు పర్యటించినట్లు చెప్పారు. కరువు కాటకాలు, ఆహార కొరత, పౌష్టికాహారలోపం వల్ల మానవాళి ఉనికి కోల్పోయే పరిస్థితుల్లో మానవ సంపదను కాపాడుకునేందుకు కమిటీ ఏర్పాటైనట్లు చెప్పారు. చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న నిత్యావసర వస్తువులు, పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తన్న నిత్యావసరాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు చేసుకున్న మహిళలకు కేసీఆర్ కిట్లు, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు అందజేస్తున్న ఆహార మెనూ తదితర అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజల హక్కులకు భంగం వాటిల్లితే బాధ్యులపై కమిషన్ కఠినచర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. కమిటీ కో చైర్మన్, భద్రాద్రి జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య మాట్లాడుతూ కమిటీ మారుమూల ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకోవడం అభినందనీయమన్నారు. కమిటీ సభ్యులు భారతి, శారద, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో విద్యాలత, డీఆర్డీవో మధుసూదన్రాజు, డీఎస్వో చంద్రప్రకాశ్, పౌర సరఫరాల సంస్థ మేనేజర్ ప్రసాద్, వైద్యాధికారి డాక్టర్ శిరీష, ఎస్సీ అభివృద్ధి అధికారి అనసూర్య, డీడబ్ల్యూవో వరలక్ష్మి, గిరిజన సంక్షేమ శాఖ డీడీ రమాదేవి, ఫుడ్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, ఎంపీటీసీలు, సర్పంచ్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.