ఓ పదివేల ఏళ్లకు ముందు.. మనిషి ఇంకా సంచారజీవిగానే ఉన్నప్పుడు బాధ్యతలు సమష్టిగానే ఉండేవి. వేట అయినా, పిల్లల పెంపకమైనా ఆ బరువు తల్లిదండ్రులిద్దరిదీ. పరిస్థితులను అనుకూలంగా మార్చుకునే తెలివి వచ్చాక.. సాగు సాయంతో జీవనం ఓ చోట స్థిరంగా మారింది. అప్పుడు మొదలైంది విభజన. ఆడవారు పిల్లల్ని, ఇంటిని చూసుకోవాలనీ.. బయటికి వెళ్లే వెసులుబాటు ఉంది కాబట్టి పశువులను, బలిష్టమైన శరీర నిర్మాణం ఉంటుంది కాబట్టి వ్యవసాయాన్నీ మగవారు చూసుకోవాలనే ఏర్పాటు జరిగింది. క్రమంగా అది పెత్తనంగా మారింది. అతివను సైతం ఆస్తిగా భావించే రోజులు మొదలయ్యాయి. అది పక్షపాత ధోరణిని దాటి, అణచివేత స్థాయికి చేరుకుంది. ఇది ఇంతే అని అందరూ సర్దుకునేంతగా సామాజిక మద్దతు దొరికేసింది. కొన్ని వందల ఏళ్లుగా ఆ పరిమితులను దాటే పోరు చేస్తూనే ఉన్నారు మహిళలు. ఒక్కో అడుగు, ఒక్కో అణచివేత, ఒక్కో నిషేధాన్ని దాటుకుని చిట్టచివరకు సమాన స్థాయికి చేరుకునే సమయంలో మళ్లీ వేల సంవత్సరాలనాటి ఆటవికతను తలపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అది కూడా నేరుగా కాదు.. డిజిటల్ జీవితంలో! అదే టీఎఫ్జీబీవీ (Technology-facilitated Gender-based Violence) సాంకేతికత సహాయంతో జరిగే లింగ వివక్షాత్మక హింస!!
జర్నలిస్ట్, నటి, యూట్యూబర్, యాత్రికురాలు, సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకురాలు, రచయిత్రి… ఏ వృత్తి చేపడితేనేం! ప్రతి వివక్షకీ జవాబుగా నిలబడిన జీవితం తనది. కానీ, తన మాటను, భావాలను, స్వేచ్ఛను, పోరాటాన్ని.. ఇష్టపడనివారు దాడిచేయడం ఇప్పుడు సులవైపోయింది. దాని ఫలితం ఏంటన్నది పక్కన పెడితే ముందుగా ఆ అక్కసుకు అవకాశాలు మాత్రం విచ్చలవిడిగా ఉన్నాయి. రచ్చబండ మీద ఊరిపెద్దలను మించి.. సోషల్ మీడియాలో ఊరూపేరూ లేకుండానే సాగే దాడులే ఇప్పుడు భయపెడుతున్నాయి.

‘అమ్మాయి ఓకే చెప్పేదాకా వెంటపడుతూనే ఉండాలి’ అనే మాటను సినిమాల్లో అలవోకగా అనేస్తాం. కానీ, దాన్ని నిజజీవితానికి అన్వయించుకుంటే మాత్రం ఒళ్లు జలదరిస్తుంది. ఆకతాయిలు ఇప్పుడు అదే మార్గంలో ఉన్నారు. ఒకవేళ ఎవరన్నా తన మాట కాదంటే ఆన్లైన్లో వెంటపడటం, వాళ్ల ఫొటోలను మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేయడం ఇప్పుడు తేలికైపోయింది. అందుకు యాప్స్ సైతం అందుబాటులో ఉన్నాయి. బంధంలో ఉన్న అమ్మాయి దూరమైతే.. ఇప్పుడు తనను బజారుకి ఈడ్చడం తేలికైపోయింది. నీతో కలిసి ఉన్న ఫొటోలను బయటపెడతా అని బెదిరించడం (sextortion), AI సాయంతో నగ్నంగా రూపొందించిన వీడియోలను పోస్ట్ చేయడం (Revenge Porn) ఇప్పుడు సర్వసాధారణం. CCRI అనే సంస్థ ప్రకారం సోషల్ మీడియాలో ఉండే ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒక్కరు ఈ అశ్లీల చిత్రాల బెదిరింపులు ఎదుర్కొంటున్నారు.

ఎవరినన్నా వెంబడించడాన్ని స్టాకింగ్ (Stalking) అంటాం. కానీ ఇప్పుడు మన సామాజిక జీవనం అంతా ఆన్లైన్లోనే కదా. ఆ డిజిటల్ ప్రయాణాన్ని వెంబడిస్తుంటే… అదే సైబర్ స్టాకింగ్ (Cyber Stalking). వీరు ప్రతి పోస్టునీ, కామెంట్నీ, స్టేటస్నీ నిరంతరం గమనిస్తూ ఉంటారు. కొందరు కేవలం వ్యామోహంతో ఈ పని చేస్తే మరికొందరు మాత్రం ద్వేషంతో వెంటాడుతుంటారు. ట్రోల్ చేస్తూ, చంపేస్తామనో, సంగతి తేలుస్తామనో బెదిరిస్తూ, బూతులతో దాడిచేసి భయపెట్టే ప్రయత్నం చేస్తారు. Amnesty International ప్రకారం ప్రతీ ముగ్గురు మహిళల్లో ఒకరు ఆన్లైన్ వేధింపులను ఎదుర్కొంటున్నారు. ఇవి కేవలం బెదిరింపులే కదా అనుకునో, ఇంట్లో చెబితే రచ్చ అవుతుందనో… చాలామంది వాటిని పట్టించుకోవడం లేదు. కానీ థాయ్లాండ్లో జరిగిన ఓ పరిశోధన ఆన్లైన్ వేధింపులు తర్వాత స్థాయిలో భౌతిక దాడులుగా మారతాయని చెబుతున్నది.

లెనన్ ఓ 13 ఏళ్ల అమ్మాయి. రియాలిటీ షోస్లో కూడా పాల్గొనేది. తన కెరీర్కి ఉపయోగపడుతుందని ఓ ఫోన్ ఇచ్చారు తల్లిదండ్రులు. దాంతోనే సామాజిక మాధ్యమాలూ అలవాటయ్యాయి. వాటిలో పరిచయం అయిన పెద్దలు క్రమంగా తనతో సంభాషణలు పెంచుకుని, వ్యక్తిగత చిత్రాలు పంపేస్థాయికి చేర్చారు. అది ఓ విష వలయంగా మారింది. లెనన్ నిజంగా పంచుకున్న కథ ఇది. ఆన్లైన్ ఓ అడవిలాంటిది. కటిక చీకటి రోజున, అందులో తోడేళ్లే నేస్తాల్లా పరిచయం పెంచుకుంటాయి. మారుపేర్లతోనో, ఫేక్ ఉద్యోగాలతోనో, తీయని మాటలతోనో దగ్గరవుతాయి. మైనర్లని, మరీ ముఖ్యంగా అమ్మాయిలే లక్ష్యంగా వీరి వేట ఉంటుంది. దీనికి ‘గ్రూమింగ్’ అని పేరు. ప్రతి అయిదుగురిలో ఇద్దరు పిల్లలు ఇలాంటివారిని ఎదుర్కొంటున్నారని తేలింది. టీనేజ్ దశలో గుర్తింపునీ, కుటుంబేతర స్నేహాలనీ కోరుకునే అమ్మాయిల పాలిట ఇది శాపమే.
రాజ్యాంగం అందరికీ భావప్రకటన స్వేచ్ఛను ఇస్తుంది. కానీ, ఇలాంటి హక్కులను ఉపయోగించినప్పుడల్లా భయభ్రాంతులను గురిచేసి ప్రాథమిక హక్కులకు దూరంగా ఉంచడాన్ని ‘chilling effect’ అంటారు. మహిళా జర్నలిస్టుల పట్ల కనిపించే వేధింపే ఇందుకు ఉదాహరణ. ఇది నిరూపించేందుకు ఐక్యరాజ్య సమితి 2020లోనే The Chilling పేరుతో ఓ సర్వేను ప్రకటించింది. ఏడాది పాటు జరిగిన ఈ శోధనలో బాధాకరమైన నిజాలు వినిపించాయి. ఈ సర్వేలో పాల్గొన్న…
ఫలితంగా ఉద్యోగం మానేయడం, దీర్ఘకాలిక సెలవు మీద వెళ్లడం, సామాజిక మాధ్యమాలకు దూరం కావడం లాంటి చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. ఫలితం! ఆకతాయిలు అనుకున్నది సాధిస్తున్నారు.
రావణుడికి పది తలలే కానీ మాధ్యమాల్లో ఉండే మృగాలకు వేలమార్గాలు. ఒక విషయంలో జాగ్రత్తపడగానే.. మరో దొడ్డిదారిలో దాడిచేస్తారు.
జాగ్రత్తలు పాటించాల్సిందే!
సామాజిక మాధ్యమాలు సత్యంగా తలుచుకుంటే.. మహిళ మీద జరిగే ఆన్లైన్ ట్రోలింగ్, బెదిరింపులు, వేధింపులు, వ్యక్తిత్వ హననం లాంటి వాటిని చాలావరకు ఆపగలవు. కానీ, సదరు కంపెనీలు అలా చేయవు అన్నది కఠినవాస్తవం. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు ఎంతలా నియంత్రించాలని చూసినా వ్యాపారమే ధ్యేయంగా సాగే ఆ సంస్థలు వీటి మీద ఉక్కుపాదం మోపవు సరికదా… మరింతగా జనాల దృష్టిని ఎంతలా కట్టిపడేయాలనే ఆలోచిస్తాయి. అందుకని మనమే కొంత జాగ్రత్తగా ఉండాలి.
ఎవరో ఊరూపేరూ పెట్టుకోవడానికి కూడా భయపడేవాడు బెదిరిస్తున్నాడులే… అని కొట్టిపారేయడానికి వీల్లేదు. ఓ ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం ఆన్లైన్ వేధింపులకు గురైన మహిళలలో ఓ 41 శాతం మంది అది క్రమంగా భౌతిక దాడులకు దారితీస్తున్నదని పేర్కొన్నారు. అందుకే…
ఆన్లైన్ వేధింపులను ఎదుర్కోవడం అంత తేలిక కాదు. దానికంటే చిమ్మచీకట్లో ఓ దట్టమైన అడవిలో మోపే అడుగే మరింత తేలిక. శత్రువు ఎవరో తెలియదు. ఎందుకు దాడి చేస్తున్నాడో అర్థం కాదు. ఆడపిల్లగా అప్పటిదాకా దాటిన పరిమితుల్ని మించి.. ఈ కొత్త పోకడ ఓ విభ్రాంతి. కానీ తప్పదు. చీకటి యుద్ధం చేసేవారిలో విచక్షణ వచ్చేవరకూ, సామాజిక మాధ్యమాలు వాటిని వ్యాపారంగా కాకుండా బాధ్యతగా చూసేవరకు, న్యాయవ్యవస్థ మరింత కఠినంగా మారేవరకు.. ప్రమాదాన్ని తట్టుకుని నిలబడాల్సిందే. వాటి గురించి అవగాహన పెంచుకుని పదిమందికీ చెప్పాల్సిందే!
X మనం తనను రేప్ చేసేయగలం
Y సరే చేసేద్దాం.
X ఓ పని చేద్దాం. తనను పిలిచుకురా. నేను ఇంకో ఇద్దరు కుర్రాళ్లని కూడా తెస్తాను. అందరం కలిసి గ్యాంగ్ రేప్ చేద్దాం.
ఈ సంభాషణ ఎవరో కరుడుగట్టిన నేరస్తుల మధ్య జరిగింది కాదు. దిల్లీలోని ప్రతిష్ఠాత్మక స్కూళ్లలో 11, 12 తరగతులు చదువుతున్న కుర్రాళ్లవి. ఆ గ్రూప్ పేరు ‘బాయ్స్ లాకర్ రూం’. కేవలం వాళ్లలో వాళ్లు విచ్చలవిడి కబుర్లు చెప్పుకోలేదు. తమ క్లాస్మేట్స్ నగ్న చిత్రాలను ప్రచారం చేశారు. మరికొంతమందిని బ్లాక్ మెయిల్ చేశారు. ఈ విషయం తెలిసి వారి మీద కంప్లయింట్ ఇవ్వడానికి ప్రయత్నించిన అమ్మాయిలను బెదిరించేందుకు ప్రత్యేకంగా మరో ఖాతాను కూడా తెరిచారు. ఆ స్క్రీన్ షాట్స్ బయటికి రాగానే ఖాతాలను మూసేసి అజ్ఞాతంగా ఉండిపోయారు. కానీ ఆ స్క్రీన్ షాట్స్ జాతీయ మీడియాలో చర్చకు రావడంతో పోలీసులు, మహిళా కమిషన్ అంతా చర్యలకు సిద్ధపడ్డారు. కొన్ని అరెస్టులైతే జరిగాయి కానీ.. భయం మాత్రం పోలేదు. ఆకతాయితనమూ ఆగలేదు. 2020లో జరిగిన ఈ సంఘటన సామాజిక మాధ్యమాలు మనలో ఆటవికతను ఎంతలా పెంచి పోషిస్తున్నాయి, దాన్ని బయటపెట్టే దారి చూపిస్తున్నాయో చెబుతున్నది.

ట్రోలింగ్ చేయడానికి ఆడామగా భేదం లేదు నిజమే. కాకపోతే మగవారిని వేటాడటంలో వివక్ష చాలా అరుదు. అందుకు మినహాయింపులు లేకపోలేదు. అవి ఒక్కోసారి ప్రాణాలు తీసిన సందర్భాలూ ఉన్నాయి.
2015, ఆగస్టు 23. జస్లీన్ కౌర్ అనే మహిళ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర జరిగిన ఓ వాదనలో.. సర్వజీత్ అనే వ్యక్తి తన మీద అశ్లీలమైన కామెంట్స్ చేశాడనీ, అతన్ని సమాజం ముందు నిలబెడుతున్నానంటూ తన ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. క్షణాల్లో అది వైరల్ అయ్యింది. అప్పటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సైతం జస్లీన్ ధైర్యాన్ని మెచ్చుకున్నారు. నిజానిజాలు గమనించకుండానే లక్షలమంది ఆ పోస్టుకు మద్దతు పలికారు. అందులో పేర్కొన్న వ్యక్తిని దిల్లీకే మచ్చ అనీ, తనో మృగం అనీ నానామాటలన్నారు. ఇదంతా తట్టుకోలేక అతను వేసిన కేస్కు జస్లీన్ బదులివ్వలేదు. పైగా ఘటన జరిగిన సమయంలో ఉన్న సాక్షులు.. సర్వజీత్ హద్దులు మీరలేదని కోర్టుకు చెప్పారు. కానీ, కేసు ముగిసేనాటికి అతని వ్యక్తిత్వ హననం జరిగిపోయింది.
2014లో ఓ ఇద్దరు అక్కాచెల్లెళ్లు (Rohtak sisters), తమను వేధించిన ముగ్గురు యువకుల మీద తిరగబడి వాళ్లను కొడుతున్న వీడియో సంచలనంగా మారింది. కేంద్ర మంత్రులు సైతం దీన్ని సమర్థించారు. ఘటన జరిగిన హరియాణాలో నాటి ముఖ్యమంత్రి వాళ్లకు ఘనమైన నగదు బహుమతి కూడా ప్రకటించారు. ఆధునిక మహిళలకు ప్రతినిధులుగా అందరూ వాళ్లను పొగుడుతున్న సమయంలో మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఈసారి ఆ అక్కాచెల్లెళ్లు మరో వ్యక్తిని కొడుతున్నారు. దాంతో వారి ప్రవర్తన మీద సందేహం కలిగి వాస్తవాలను తవ్వగానే నాటి సంఘటన ఈవ్ టీజింగ్ కాదు. బస్సులో సీటు కోసం జరిగిన గొడవ అని తేలింది. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఆ ముగ్గురు యువకులలో ఇద్దరు సైన్యంలో చేరబోతుండగా… వారిని సదరు ఉద్యోగాలకు అనర్హులుగా తేల్చేశారు.
మానవ్ సింగ్ ఓ పదిహేడేళ్ల కుర్రాడు. బాగా చదువుతాడు. కానీ, అకస్మాత్తుగా ఓ రోజు భవ్లీన్ కౌర్ అనే అమ్మాయి అతను తనని వేధించాడంటూ ఇన్స్టా పోస్టులు పెట్టింది. పోస్ట్ అయిన క్షణాల్లోనే మానవ్ను తిడుతూ కాల్స్ రావడం మొదలైంది. ఆ ఒత్తిడిని తట్టుకోలేక అతను తన అపార్ట్మెంట్ మీద నుంచి దూకి చనిపోయాడు. చనిపోయాక కూడా భవ్లీన్ తనను ఎగతాళి చేస్తూ అతని చావు సంతోషం కలిగించిందని ఇంకో పోస్ట్ పెట్టింది. ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని మానవ్ తండ్రి ఎంతగా మొత్తుకున్నా పోలీసులు పట్టించుకోలేదు. చివరికి జాతీయ మానవహక్కుల కమీషన్ పరిశోధన వేగం పుంజుకుంది. మానవ్ తప్పులేదని తేలింది.
ఈ ఉదాహరణలు చెప్పుకోవడానికి రెండు కారణాలు. ఒకటి అరుదుగా మగవారు కూడా ఆన్లైన్ వేధింపులకు గురవుతారు. రెండు! ఓ నాలుగైదు ఉదాహరణలే ఇంత హృదయ విదారకంగా ఉంటే.. అడుగడుగునా వెతలు పడుతున్న లక్షలాది మహిళల సంగతేంటి.
అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి పెళ్లి చేయాలంటారు. అలా చేసిన పెళ్లిళ్లు భద్రంగా ఉంటాయన్నది చాలామంది నమ్మకం. అన్లైన్ దానికీ తూట్లు పొడిచేస్తున్నది. ఈ వెబ్సైట్లలో దాదాపు 88 శాతం నకిలీ ప్రొఫైల్సే అని ఓ సర్వే చెబుతుండటం గమనార్హం.
సవాలక్ష మ్యాట్రిమోనియల్ సైట్లలో కనిపించే ప్రొఫైల్స్ని ఎవరూ నిర్ధరించలేకపోతున్నారు. దాంతో విజయవంతమైన జీవితాలను చూపించి ఉచ్చులోకి దించుతున్నారు. ఇక పెళ్లి జరిగిపోతుంది అనే భ్రమలో చనవుగా అడిగిన డబ్బులు ఇస్తున్నారు. మరి కొందరైతే మరో అడుగు ముందుకేసి శారీరికంగానూ లోబర్చుకుంటున్నారు. తర్వాత ఆ ఫొటోలను పబ్లిక్ చేస్తామని బెదిరిస్తున్నారు. మరీ ముఖ్యంగా నిశ్చితార్థం జరిగిన తర్వాత సగం పెళ్లి అయిపోయినట్టే అన్న భావనతో పెరిగే చనువు, మోసగాళ్లకు మరింత అవకాశాన్నిస్తుంది. ఆన్లైన్ మ్యాట్రిమొని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓ ప్రొఫైల్ ఫేక్ అని తేలితే ఇతరులు మోసపోకుండా రిపోర్ట్ చేయాలి; ఆర్థిక లావాదేవీల జోలికి పోకూడదు; పూర్తి నమ్మకం లేకుండా నిశ్చితార్థానికి సిద్ధపడకూడదు.
– కె.ఎల్.సూర్య