ప్రతి నియోజకవర్గం నుంచి వందమందిని ఎంపికచేయాలి
ఆర్థికాభివృద్ధి ఉండే రంగాలను దళితులు ఎంచుకోవాలి
దళితబంధు అమలుపై అధికారుల సమీక్షలో భద్రాద్రి కలెక్టర్
భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, డిసెంబర్ 21: దళితబంధు పథకం ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమమైనందున దళితుల అభివృద్ధిలో అన్ని శాఖల అధికారులు భాగస్వాములు కావాలని భద్రాద్రి కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ సూచించారు. దళితబందు పథకం అమలుపై అన్ని శాఖల అధికారులతో కొత్తగూడెంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రతి నియోజకవర్గం నుంచి 100 మంది దళితులను పథకానికి ఎంపిక చేస్తామని, ఒక్కొక్కరికీ రూ.10 లక్షలు మంజూరవుతాయని అన్నారు. ఈ అవకాశాన్ని దళితులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్వీయ అభివృద్ధి సాధించేందుకు కృషి చేయాలన్నారు. అభివృద్ధికి అవకాశం ఉండే రంగాలను దళితులు ఎంచుకునే విధంగా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. లబ్ధిదారులు అవగాహన ఉన్న పరిశ్రమలు, వ్యాపార అవకాశాలను ఎంచుకొని అభివృద్ధి చెందేందుకు అన్నిశాఖల అధికారులు వారివారి శాఖల సమగ్ర నివేదికలు రూపొందించాలన్నారు. ప్రభుత్వమిచ్చే రూ.10 లక్షలను దళితుల సక్రమంగా వినియోగించుకునేలా జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారులు, ఎస్సీ కార్పొరేషన్ అధికారులు అందజేసిన నివేదికలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేయాలన్నారు. అందరూ ఒకే రకమైన యూనిట్లు కాకుండా వివిధ రకాల యూనిట్లు నెలకొల్పుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. మిగిలిన నగదు లబ్ధిదారుల ఖాతాల్లోనే ఉంటాయని, ప్రభుత్వం వెనక్కు తీసుకోదని, అలాంటి అపవాదులను నమ్మవద్దని సూచించారు. లబ్ధిదారులందరూ గ్రూపుగా ఏర్పడి భారీ యూనిట్లను నెలకొల్పుకోవచ్చన్నారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్సీ అభివృద్ధి అధికారి అనసూర్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ముత్యం, డీఆర్డీవో మధుసూదన్రాజు, డీపీవో రమాకాంత్ అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.