ఎరువులు, విత్తనాల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి
కలెక్టర్ శశాంక
వివిధ శాఖల అధికారులతో సమీక్ష
కరీంనగర్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయించే వారికి సహకరించే వారిని ఉపేక్షించేది లేదని కలెక్టర్ శశాంక హెచ్చరించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఆయన సీపీ కమలాసన్రెడ్డి, వ్యవసాయ, ఎక్సైజ్, పోలీసు శాఖ అధికారులు, విత్తనాల డీలర్లతో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల అమ్మకం, గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణాపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈసారి నకిలీ విత్తనాలు, ఎరువుల బెడద లేదని, రైతులు నాణ్యమైన పత్తి విత్తనాలను కొనుగోలు చేసినట్లు తెలిపారు. 340 రకాల వరి విత్తనాల శాంపిల్స్ సేకరించి హైదరాబాద్కు పరీక్ష కోసం పంపగా ఒక శాంపిల్ మాత్రమే తకువ శాతంలో మొలకెత్తని విత్తనాలుగా తేలిందని పేర్కొన్నారు. సదరు విత్తన కంపెనీపై కేసు నమోదు చేసి, డీలర్పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీసు, వ్యవసాయాధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టి నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అమ్మకుండా చూడాలన్నారు. జిల్లాలో మత్తు పదార్థాల అక్రమ రవాణా నివారణకు పోలీస్శాఖ సహకారంతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. సీపీ కమలాసన్రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో ఐదేళ్లుగా నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తుండడంతో ఈసారి నకిలీ విత్తనాల విక్రయాలు తగ్గినట్లు తెలిపారు. ఈ ఏడాది నకిలీ పురుగు మందులు విక్రయించిన ఒకరిపై మాత్రమే కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. మత్తు పదార్థాలు అక్రమంగా సరఫరా చేసే వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత నాలుగేళ్లలో జిల్లాలో 1143 కిలోల గంజాయి పట్టుకొని 186 మందిని అరెస్టు చేసి 73 కేసులు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. ఏఎస్పీ రితిరాజ్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆర్డీవో ఆనంద్కుమార్, పోలీసు అధికారులు, ఎక్సైజ్ అధికారులు, విత్తనాల కంపెనీల డీలర్లు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి
కరీంనగర్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): జిల్లాలో ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్ శాఖ ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ శశాంక ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో బుధవారం ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్, నగరపాలక సంస్థ ఇంజినీర్లతో అభివృద్ధి పనుల ప్రగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణాలు ఈనెల 15లోగా, కరీంనగర్ అర్బన్ పరిధిలో రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. షాదీఖాన గ్రౌండ్ఫ్లోర్ పూర్తి చేయాలని, కొత్త కళాభారతి నిర్మాణానికి టెండర్లు పిలువాలని సూచించారు. ఆర్అండ్బీ గెస్ట్హౌస్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ మయాంక్ మిట్టల్, ఆర్అండ్బీ ఈఈ సాంబశివరావు, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాసరావు, నగరపాలక సంస్థ ఎస్ఈ కృష్ణారావు, ఈఈ రామన్, తదితరులు పాల్గొన్నారు.