కోనరావుపేట, జూన్ 7: పింఛన్ ఇప్పిస్తానంటూ అనాథ వృద్ధురాలి ఆస్తిని కబ్జా చేసుకొని, ఇంటి నుంచి గెంటేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లిలో వెలుగుచూసింది. నిమ్మపల్లిలో మానుక నర్సవ్వ, రాజయ్య వృద్ధ దంపతులకు సంతానం లేదు. నాలుగేళ్ల క్రితం రాజయ్య అనారోగ్యంతో మృతిచెందగా, నర్సవ్వ ఇంట్లోనే ఒంటరిగానే కాలం వెల్లదీస్తున్నది. దీంతో బంధువైన మానుక శంకర్, అతని కొడుకు నరేశ్ కలిసి నర్సవ్వకు పింఛన్ ఇప్పిస్తామని నమ్మబలికి సంతకాలు తీసుకున్నారు. అధికారులతో కుమ్మకై ఇల్లుతోపాటు సర్వేనంబర్ 313లో రెండు ఎకరాల భూమిని తమ పేరిట పట్టా చేయించుకొన్నారు. కాగా, నర్సవ్వకు ఇటీవల చేతకాకపోవడంతో కొద్దిరోజులుగా కులస్థులు అన్నం పెడుతున్నారు. దీంతో ఆస్తి అమ్మి, వచ్చిన డబ్బులతో బతుకుదామని నర్సవ్వ భావించి కులస్థులను ఆశ్రయించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నర్సవ్వ తన ఆస్తి గురించి శంకర్ను నిలదీయగా చితకబాది ఇంటి నుంచి గెంటేశాడు. బాధితురాలు న్యాయంకోసం పోలీసులను ఆశ్రయించింది.