థైరాయిడ్… చాలా మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్య. గతంలో పదిమందిలో ఒకరు మాత్రమే థైరాయిడ్ బారిన పడేవారు. ఇప్పుడు, ప్రతి ముగ్గురూ థైరాయిడ్ బాధితులే. అందులో ఇద్దరు మహిళలే. ఈ నేపథ్యంలో థైరాయిడ్పై ఓ కన్నేసి ఉంచమని డాక్టర్లు సూచిస్తున్నారు. ‘ప్రపంచ థైరాయిడ్ దినం’ (మే 25) సందర్భంగా సమస్య మూలాలపై విశ్లేషణ..
శరీరంలోని ప్రతి కణాన్ని థైరాయిడ్ గ్రంథి నియంత్రిస్తుంది. ఇది గొంతు ప్రాంతంలో సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. దీని నుంచి థైరాయిడ్ హార్మోన్ విడుదలవుతుంది. ఈ హార్మోన్ తగిన మోతాదులో విడుదలైతేనే ప్రతి కణం సరిగ్గా పని చేస్తుంది. హార్మోన్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పుడే సమస్యలు ఏర్పడుతాయి. థైరాయిడ్లో టీ3, టీ4 హార్మోన్ల సంఖ్య, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (టీఎస్హెచ్) కౌంటింగ్ చాలా కీలకం. వీటి హెచ్చుతగ్గులపైనే థైరాయిడ్ సమస్య ఆధారపడి ఉంటుంది. థైరాయిడ్ హార్మోను ఎక్కువగా విడుదలైతే ‘హైపర్ థైరాయిడిజం’ అనీ, తక్కువగా విడుదలైతే ‘హైపో థైరాయిడిజం’ అనీ అంటారు. అయితే ఎక్కువ మందిలో కనిపించేది హైపో థైరాయిడిజమే. ఇందులో, థైరాయిడ్ హార్మోన్ తక్కువగా విడుదల అవుతుంది. అంటే టీ3, టీ4 హార్మోన్లు తగ్గి.. టీఎస్హెచ్ పెరుగుతుంది.
హైపో థైరాయిడిజం కొందరిలో జన్యుపరంగా కూడా సంక్రమిస్తుంది. ఇది మహిళల్లోనే అధికంగా కనిపిస్తుంది. ఒక్కసారిగా బరువు పెరగడం, మానసిక ఆందోళన, గర్భధారణ సమస్యలు, గర్భందాల్చినా అబార్షన్లు కావడం, రక్తహీనత, నెలసరి సరిగా కాకపోవడం, నెలసరిలో అధిక రక్తస్రావం, గుండె వేగం తగ్గడం, గొంతులో (మాటలో) మార్పులు, వెంట్రుకలు రాలిపోవడం, ముఖం ఉబ్చినట్లు కనిపించడం, శరీరమంతా నీరసంగా, నిస్తేజంగా ఉండటం.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించి థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవాలి. హైపో థైరాయిడిజం ఒక్కసారి నిర్ధారణ అయితే,జీవితాంతం ఉంటుంది. నియంత్రణలో ఉంచుకునేందుకు క్రమం తప్పకుండా మందులు వాడాలి.
‘హైపర్’ లక్షణాలు
హైపర్ థైరాయిడిజం చాలా తక్కువ మందిలో వస్తుంది. బరువు తగ్గిపోవడం, కనుగుడ్లు బయటకు వచ్చినట్లు కనిపించడం, తీవ్రంగా చెమటలు పట్టడం, తరచూ విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది చికిత్సతో తగ్గిపోతుంది. థైరాయిడ్ సమస్య ఉన్నవారు ప్రతి మూడు నెలలకోసారి
పరీక్ష చేయించుకొని, మందులు వాడటం మంచిది.
గర్భిణులు జాగ్రత్తగా…
థైరాయిడ్ వల్ల గర్భధారణ సమస్యలు తలెత్తుతాయి. ఒకవేళ గర్భం దాల్చినా థైరాయిడ్ హార్మోన్ల హెచ్చుతగ్గుల ప్రభావం గర్భంపై పడి అబార్షన్ అవుతుంది. అలా అని, భయపడాల్సిన పన్లేదు. డాక్టర్లు సమస్య పరిష్కారానికి తగిన మందులు ఇస్తారు. థైరాయిడ్ సమస్య జన్యుపరంగా సంక్రమించే అవకాశం ఉండటంతో బిడ్డ పుట్టగానే థైరాయిడ్ పరీక్షలు చేయించడం ముఖ్యం. లేదంటే బిడ్డ ఎదుగుదలపై, మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తుంది.
ఆహారమే రక్షణ…
థైరాయిడ్ సమస్య రాకుండా ఉండాలన్నా, వచ్చినా నియంత్రణలో ఉండాలన్నా తగిన ఆహారమూ ముఖ్యమే. అయోడిన్ అధికంగా ఉన్న పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. అయోడిన్ సమృద్ధంగా ఉన్న ఉప్పునే వాడాలి. అరటిపండ్లు, క్యారెట్, గుడ్లు, పాలకూర, వెల్లుల్లి, ఆలుగడ్డ తినాలి. జింక్, రాగి ఎక్కువగా లభించే చేపలు, నట్స్, రాగులు తీసుకోవాలి. క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ముల్లంగి, సోయా గింజలు, చిలగడ దుంపలు, పాలిష్ బియ్యం వంటి వాటికి దూరంగా ఉండాలి. వ్యాయామం ఎంతో ముఖ్యం. థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నవారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి, కరోనా సోకే ఆస్కారం ఎక్కువ. మిగిలినవారితో పోలిస్తే మరింత జాగ్రత్తగా ఉండాలి.
పరీక్ష చేయించుకోవాలి
థైరాయిడ్ సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. దీని బారిన పడేవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నది. లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ను సంప్రదించి పరీక్ష చేయించుకోవాలి. తద్వారా తక్కువ డోస్ మందులతో బయటపడొచ్చు. లేదంటే, వ్యాధి ముదిరి మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
డాక్టర్ టి.ఎన్.జె. రాజేష్
జనరల్ ఫిజీషియన్,స్ట్టార్ హాస్పిటల్