న్యూఢిల్లీ, మే 2: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్కిషోర్ (పీకే) సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన వ్యూహాలతో బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు అఖండ విజయాన్ని అందించిన ఆయన.. ఇక ‘ఎన్నికల మేనేజ్మెంట్’ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ‘నేను చేస్తున్న పనిని ఇక కొనసాగించదలచుకోలేదు. నేను చేయదగినది చేశా. కొంతకాలం విశ్రాంతి తీసుకుని.. జీవితంలో ఇంకేదైనా చేయాల్సిన సమయమొచ్చింది. ఎన్నికల వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నా’ అని ఆదివారం ఒక జాతీయ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తాను నిర్వహిస్తున్న ఐ-ప్యాక్ (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ) బాధ్యతలు వేరొకరికి అప్పగించేందుకు ఇదే సరైన సమయమని అన్నారు. రాజకీయాల్లో తిరిగి చేరుతారా అని ప్రశ్నించగా.. రాజకీయ నేతగా తాను విఫలమయ్యానని బదులిచ్చారు. భవిష్యత్లో ఏమి చేయాలో ఆలోచించుకోవాల్సి ఉన్నదన్నారు. మరోవైపు, బెంగాల్ ఎన్నికల ఫలితాలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. మమతకు ప్రజలు ఏకపక్ష విజయాన్ని అందించారని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం వివక్షాపూరితంగా వ్యవహరించిందని, తమ ప్రచారానికి అడ్డంకులు కల్పించిందని ఆరోపించారు. ఎన్నికల్లో ఎదురైన సవాళ్లపై స్పందిస్తూ.. ఏ రాష్ట్రంలోనూ లేనంతగా బెంగాల్లో మతం పేరిట ప్రజలను పోలరైజ్ చేసే ప్రయత్నాలు జరిగాయని, అయినా ఎన్నికల సంఘం మౌనంగా ఉండిపోయిందన్నారు. ప్రచారం సందర్భంగా మమతకు గాయం కావడం ఆందోళనకు గురిచేసిందని, ఎందుకంటే ప్రచారం మొత్తం ఆమెపైనే ఆధారపడి ఉందని గుర్తుచేశారు. మమత వీల్చైర్లోనే ప్రచారం చేయడాన్ని బీజేపీ ఎన్నికల స్టంట్గా ఎగతాళి చేసిందని, అయితే ప్రజలు దీనికి గట్టిగా బదులిచ్చారన్నారు.
తృణమూల్ విజయం ప్రతిపక్షాలకు ఒక సందేశం అని, తాము కూడా బీజేపీకి ఎదురు నిలిచి గెలవగలమని ఈ విజయం చాటిచెబుతున్నదని పీకే అన్నారు. కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ గురించి స్పందిస్తూ.. ఆ పార్టీకి 100 ఏండ్లుకుపైగా చరిత్ర ఉన్నదని, వారి దారిలో వారు వెళ్తున్నారని అన్నారు. ప్రశాంత్ కిషోర్ లేదా ఇతరులు చెప్పినట్టు వారు వినరని చురకలంటించారు. పార్టీ నిర్వహణలో సమస్య ఉన్నదని కాంగ్రెస్ ఇప్పటికైనా గుర్తించాలని, దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలన్నారు.
మమతకు సమోసాలు, కట్లెట్ అంటే ఇష్టమని పీకే చెప్పారు. సమావేశాల్లో ఆమెకు స్నాక్స్ ముఖ్యమని సరదాగా వ్యాఖ్యానించారు. ఎక్కువ సేపు సమావేశాలు కొనసాగించడం మమతకు నచ్చదని చెప్పారు.
బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ స్కోరు రెండంకెలు (99) దాటదని ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలు అక్షరాలా నిజమయ్యాయి. గతేడాది డిసెంబర్ 21న ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది. ‘వాస్తవానికి బెంగాల్లో బీజేపీ రెండంకెలకు మించి సీట్లు సాధించలేదు. అంతకంటే ఎక్కువ సీట్లు సాధిస్తే ట్విట్టర్ను వీడుతా’ అని ప్రశాంత్ కిషోర్ నాడు ట్వీట్ చేశారు.