ఏటా పెరుగుతున్న వరి సాగుకు పొంచి ఉన్న ప్రమాదం
సారవంతమైన నేలలు, దిగుబడులపై తీవ్ర ప్రభావం
హెక్టార్ వరితో 1,488 కిలోల కార్బన్ డై ఆక్సైడ్ విడుదల
సేంద్రియ ఎరువుల వైపు మళ్లాలంటున్న అధికారులు
కొత్తగూడెం, నవంబర్ 17: రోజురోజుకూ రసాయనిక ఎరువుల వాడకం పెరిగిపోతుండడంతో క్రమక్రమంగా భూసారం క్షీణిస్తున్నది. ఫలితంగా దిగుబడులపై ప్రభావం చూపుతున్నది. పంటలకు తెగుళ్లు సోకినప్పుడు రైతులు వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు తీసుకోకుండానే ప్రైవేట్ కంపెనీల మాయలో పడి అధిక మోతాదులో రసాయన ఎరువులను వినియోగిస్తున్నారు. దీనివల్ల అనేక దుష్ప్రభావాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే సేంద్రియ ఎరువులు కనీసం 25 శాతమైనా వినియోగిస్తే విషవాయువుల ప్రభావం తగ్గుతుందని, మంచి దిగుబడులు వస్తాయని పేర్కొంటున్నారు. భద్రాద్రి జిల్లాలో రసాయనిక ఎరువుల వినియోగం, కలిగే నష్టాలు, సేంద్రియ ఎరువులతో ప్రయోజనాలపై ‘నమస్తే తెలంగాణ’ కథనం.
పచ్చని పంటల్లో రసాయన మందులు ఆందోళన కలిగిస్తున్నాయి. పంటలకు తెగుళ్లు సోకకుండా ఉండేందుకు అన్నదాతలు అధిక మోతాదులో రసాయన ఎరువులను వినియోగిస్తున్నారు. దీంతో సారవంతమైన భూములు విషతుల్యమవుతున్నాయి. దిగుబడులపై ప్రభావం పడుతోంది. ఏటా పెరుగుతున్న వరిసాగుకు తీవ్ర ముప్పు పొంచి ఉంది. కెమికల్స్ వినియోగంతో భూగర్భ జలాలు కలుషితమై ప్రమాదకర మిథేల్ లాంటి విషవాయువులు విడుదలవుతాయి. తద్వారా బ్లుబేబీ సిండ్రోమ్ లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదమూ ఉంది. ఒక హెక్టార్ వరితో 1488 కిలోల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతుంది. ప్రకృతి సమతుల్యతా దెబ్బతింటుంది. వరి సాగును తగ్గించి పంట మార్పిడి చేయాలని, ఆరుతడి పంటలు వేయడం మంచిదని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
సేంద్రియ వ్యవసాయమే ముద్దు..
రసాయన ఎరువుల వినియోగంపై వ్యవసాయశాఖ ఏటా అవగాహన కల్పిస్తున్నప్పటికీ రైతులు మాత్రం ప్రైవేటు కంపెనీల మాయలో పడి రసాయనిక ఎరువుల వినియోగాన్ని పెంచుతున్నారు. వ్యవసాయ యూనివర్సిటీల్లో పట్టాలు అందుకున్న అధికారుల సలహాలు తీసుకోకుండా ప్రైవేటు కంపెనీలు, ఎరువుల దుకాణాదారుల మాటలు నమ్ముతున్నారు. దీంతో పంటలు దిగుబడి వస్తే రావచ్చునేమోకానీ నేలల్లో ఉన్న సారం మాత్రం పూర్తిగా దెబ్బతింటుంది. ఏటికేడు పెంచుకుంటూ పోతున్న వరిసాగులో ఈ కెమికల్స్ వినియోగం కారణంగా పంట నేలలు మరింత నిస్సారమవుతున్నట్లు అధికారులు గుర్తిస్తున్నారు. రైతులు వాడే యూరియాలో 48 శాతం మాత్రమే నత్రజని ఉంటుంది. మిగతా 52 శాతం లవణాలు, క్షారాలు ఉంటాయి. సూపర్ ఫాస్పేట్లో 16 శాతం ఫాస్పేట్ ఉంటుంది. 84 శాతం క్షారాలు ఉంటాయి. ఇక పొటాషియం సల్ఫేట్లో 48 శాతం పొటాష్ ఉంటుంది. మిగతా 52 శాతం క్షారాలు ఉంటాయి. లవణాలు, క్షారాలు మట్టి కణాల మధ్య చేరి భూగర్భ నీటితో కలిసినప్పుడే ఆమ్మోనియా సీవో-2 వాయువుగా మారుతుంది. మట్టి కణాల మధ్య ఖాళీలన్నీ లవణాలు, క్షారాలతో నిండిపోతాయి. సిమెంట్, కంకరలా మట్టి కణాలను బంధిస్తాయి. ఈ కారణంగా వర్షపు నీరు నేలలో ఇంకదు. దీంతో నేల సత్తుబడి పోతుంది.
అధికంగా వినియోగించే ఎరువులివే..
భద్రాద్రి జిల్లాలో రసాయనాల వినియోగం విచ్చలవిడిగా జరుగుతోంది. యూరియాను అతిగా వినియోగిస్తున్నారు. జిల్లాలో గత వానకాలం, యాసంగిలో యూరియా 38,998 వేల మెట్రిక్ టన్నులు, డీఏపీ 2,864 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 22,007 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 2,426 మెట్రిక్ టన్నులు. ఎస్ఎస్పీ 2,802 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులు వినియోగించారు. ఎకరానికి యూరియా 50 కిలోల వరకు వినియోగించాల్సి ఉండగా 150 నుంచి 200 కిలోల వరకు వినియోగిస్తున్నారు. పొలాల్లో వేసిన యూరియా భూగర్భజలాలకు చేరి దాని తర్వాత నైట్రేట్గా మారిపోతుంది. నైట్రేట్ వల్ల బ్లూబేది సిండ్రోమ్ లాంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది.
వరి కొయ్యలకు నిప్పు..
పొలంలో వరి కొయ్యలను కాల్చడం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. దీనివల్ల ఒకదానితో మరొక సమస్య ఉత్పన్నమవుతోంది. కాల్చివేసే క్రమంలో వరి కొయ్య దగ్ధమవడంతోపాటు భూమి గట్టి పడిపోతుంది. అలా గట్టిపడిన భూమి దున్నే సమయంలో సరిగ్గా మెత్తబడదు. ఫలితంగా పొలాన్ని కలియదున్నడం వీలుకాదు. కాల్చివేయడం వల్ల భూమిలో ఉన్న సూక్ష్మక్రిములూ చనిపోతాయి. వానపాములు నాశనమవుతాయి. ఫలితంగా భూమి గుల్లగా మారే పరిస్థితి ఉండదు. దీంతో నాట్లు వేసిన తర్వాత వరికి సరైన పోషకాలు అందవు. ఫలితంగా పైరు సరిగా పెరగదు. దీంతో రైతులు ఎక్కువగా యూరియాను వినియోగించాల్సి వస్తుంది. యూరియా ఎక్కువగా వేసినప్పటికీ దాన్ని స్వీకరించి వేర్లకు అందించే సూక్ష్మజీవులు అప్పటికే మృతిచెంది ఉండడం వల్ల యూరియా వ్యర్థమవుతుంది. విచ్చలవిడిగా యూరియా వాడడం భవిష్యత్తులో భూగర్భజలమంతా విషతుల్యమవుతుంది. వేర్లకు సరిగా గాలి తగలదు. దీంతో పంటలకు చీడపీడలు ఆశించి పొలం దెబ్బతింటుంది. ఇదంతా నేరుగా పొలం, పంటలపై ప్రతిఫలిస్తుంది.