గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులు
ఉమ్మడి జిల్లాలో 33 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ
ఖమ్మం ఎడ్యుకేషన్/కొత్తగూడెం ఎడ్యుకేషన్, జూలై 17: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శనివారం పాలిసెట్ ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మం నగరంలోని 15 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. 3,774 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, వీరిలో 324 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఒక్క నిమిషం ఆలస్యమైన కేంద్రాల్లోకి అనుమతించేది లేదని అధికారులు ముందే ప్రకటించడంతో విద్యార్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు. ప్రతిఒక్కరూ మాస్క్ ధరించి పరీక్షకు హాజరయ్యారు. కేంద్రాల నిర్వాహకులు విద్యార్థుల కోసం శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. సిబ్బంది ప్రతిఒక్కరికీ థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి కేంద్రంలోకి అనుమతించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్ష నిర్వహించినట్లు పరీక్షల కో-ఆర్డినేటర్ రత్నప్రసాద్ తెలిపారు. ఆయన జిల్లాలో పలు కేంద్రాలను తనిఖీ చేశారు. పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
భద్రాద్రి జిల్లాలో..
కొత్తగూడెంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కొత్తగూడెం, చుంచుపల్లి హైస్కూల్, ప్రభుత్వ జూనియర్ కాలేజ్, సెయింట్ జోసెఫ్ హైస్కూల్ -రుద్రంపూర్, సింగరేణి మహిళా డిగ్రీ కళాశాల హెడ్డాఫీస్, సింగరేణి మహిళా జూనియర్ కళాశాల హెడ్డాఫీస్, సింగరేణి ఉన్నత పాఠశాల పోస్టాఫీస్, అబ్దుల్ కలాం ఇంజినీరింగ్ కళాశాల -వేపలగడ్డ, రామచంద్ర డిగ్రీ, పీజీ కళాశాల- లక్ష్మీదేవిపల్లిలో శనివారం పాలిసెట్ జరిగింది. 2,278 మంది పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోగా 1,971 మంది పరీక్షకు హాజరయ్యారు. సత్తుపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల- సత్తుపల్లి, మదర్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజ్- సత్తుపల్లి, సాయి స్ఫూర్తి ఇంజినీరింగ్ కాలేజ్ -సత్తుపల్లి పరిధిలో 725 మందికి గాను 659 మంది హాజరైనట్లు పరీక్షల కో- ఆర్డినేటర్, కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ నాగముని నాయక్ తెలిపారు. భద్రాచలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్స్ బ్లాక్, ఆర్ట్స్ బ్లాక్ (కూనవరం రోడ్ భధ్రాచలం), ప్రభుత్వ జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పోస్టాఫీస్, కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ చర్లా రోడ్ భద్రాచలం, టీటీడబ్ల్యూఆర్జేఆర్ కాలేజ్ చర్లా రోడ్- భద్రాచలం పరిధిలో 925 మందికి గాను 813 మంది పరీక్ష రాశారని, 112 మంది గైర్హాజరైనట్లు పరీక్షల కో- ఆర్డినేటర్, భధ్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ భద్రయ్య తెలిపారు. పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు తనిఖీ చేశాయి.