ఆశ కార్యకర్తలు ఆరోగ్య వారథులు.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య వివరాలు తెలుసుకుని ప్రభుత్వానికి సమాచారం అందిస్తారు. గర్భిణులకు మందులు అందించడం, ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవమయ్యేలా చూడడం, పిల్లలకు టీకాలు వేయించడం, తద్వారా మాతా శిశుమరణాలు తగ్గించడం వీరి ప్రధాన విధులు. కరోనా వంటి ప్రాణాంతక వ్యాధుల గుర్తింపులోనూ వీరందించిన సేవలు అమోఘం. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ రోగాల కట్టడికి కృషి చేస్తున్నారు. గర్భిణులు ప్రసవమయ్యే వరకు ప్రతినెలా వారికి సూచనలు చేస్తూ సుఖప్రసవాలు జరిగేలా అవగాహన కల్పిస్తున్నారు. దీంతో సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్య మరింత పెరిగింది. పల్లెలు, తండాల్లోని ప్రజల ఆరోగ్య సంరక్షణలో ఆశ కార్యకర్తలు కీలకపాత్ర పోషిస్తున్నారు. వీరి సేవలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
నవ మాసాలు మోసి జన్మనిచ్చేది అమ్మ… తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి మరణించే వరకు మనిషికి సేవలు అందించేది ఆశ కార్యకర్త. గర్భిణులు, బాలింతలు, పసిపిల్లలు, బాలలు, వృద్ధులకు అందరికీ దిక్కు ఆశ కార్యకర్తలే. తల్లిలా లాలిస్తూ… బుజ్జగిస్తూ.. పాటలు పాడుతూ విధి నిర్వహణలో తనకు తానే సాటి… తమలా సేవలు చేసేందుకు ఎవరూ రారు పోటీ
అనేవిధంగా విధులు నిర్వహిస్తున్నారు ఆశ కార్యకర్తలు.
– సత్తుపల్లి, డిసెంబర్ 21
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య వివరాలు తెలుసుకుని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారం అందించే ఆరోగ్య వారధులు ఆశ కార్యకర్తలు. గర్భిణులకు మందులు అందించడం, ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవమయ్యేలా చూడడం, పిల్లలకు టీకాలు వేయించడం, తద్వారా మాతా శిశు మరణాలు తగ్గించడం వీరి ప్రధాన విధులు. కరోనా వంటి ప్రాణాంతక వ్యాధుల గుర్తింపులోనూ వీరు అందించిన సేవలు అమోఘం. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ దగ్గు, జలుబు, జ్వరం తదితర చిన్నపాటి వ్యాధులకు మందులు అందిస్తూ ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ రోగాల కట్టడికి చర్యలు చేపడుతున్నారు. మహిళలు గర్భం దాల్చిన నాటినుంచి ప్రసవం అయ్యే వరకు ప్రతినెలా వారికి సూచనలు చేస్తూ సుఖప్రసవాలు జరిగేలా అవగాహన కల్పిస్తున్నారు. దీంతో సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్య మరింత పెరిగింది. పల్లెలు, తండాల్లోని ప్రజల ఆరోగ్య సంరక్షణలో ఆశ కార్యకర్తలు కీలకపాత్ర పోషిస్తున్నారు. గ్రామాల్లో 18 ఏళ్లు నిండిన యువతులకు వివాహం జరిగిన వెంటనే ఆ గ్రామ అంగన్వాడీ కేంద్రాల్లో వివాహ నమోదు తేదీని ధ్రువీకరించేలా చర్యలు చేపడతారు. పీహెచ్సీ కేంద్రానికి తీసుకువెళ్లి పరీక్షలు చేయించి గర్భిణిగా ధ్రువీకరిస్తారు. వెంటనే 12వారాలకు చెందిన ఎంసీపీ కార్డులను అందజేసి పేరు నమోదు చేస్తారు. అనంతరం టీటీ ఇంజక్షన్ ఇప్పించి అదే రోజున కేసీఆర్ కిట్ కోసం ఆన్లైన్లో పేరు నమోదు చేస్తారు.
మొదటి నెల నుంచే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి రక్తం, యూరిన్, థైరాయిడ్ పరీక్షలు చేయించి కాల్షియం, ఐరన్ మాత్రలు అందజేస్తున్నారు. మొదటి నెల నుంచి 9వ నెల వరకు చుక్కలతో కూడిన బొమ్మలు నింపేలా కార్డును గర్భిణికి అందజేసి నిత్యం మాత్రలు వేసుకుంటూ చుక్కలు కలపాలని అవగాహన కల్పిస్తారు. దీంతో తల్లి కడుపులో బిడ్డ ఎదుగుదల కనబడేలా చివరివరకు బొమ్మ తయారవుతుంది. ఇక మూడోనెల నుంచి గర్భిణి ఇంటికి ప్రతిరోజూ వెళ్లి సుఖప్రసవం జరిగేందుకు దోహదపడే సూచనలు, యోగాసనాలు, చిట్కాలు వివరిస్తారు. మూడోనెలలోనే కేసీఆర్ కిట్లో భాగంగా ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, అబ్బాయి పుడితే రూ.12 వేల నగదు పారితోషికం తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేయించేందుకు కృషి చేస్తారు. వాటితోపాటు కేసీఆర్ కిట్ అందించి సాధ్యమైనంత వరకు సుఖప్రసవం జరిగేలా అవగాహన కల్పిస్తారు.
గర్భం దాల్చిన మొదటిరోజు నుంచే అంగన్వాడీ కేంద్రంలో పేరు నమోదు చేయిస్తారు. ప్రతిరోజూ అంగన్వాడీ కేంద్రంలో ప్రభుత్వం అందించే పౌష్టికాహారం తినేలా అవగాహన కల్పిస్తారు. 7, 8, 9 నెలల్లో గర్భిణులను 102 అమ్మఒడి వాహనంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి లేదా పీహెచ్సీ కేంద్రానికి తీసుకెళ్లి గైనకాలజిస్ట్ను కలిసి దగ్గరుండి పరీక్షలు చేయిస్తారు. టిఫా స్కానింగ్ చేయించి తల్లీబిడ్డల ఆరోగ్య పరిస్థితి వైద్యుల ద్వారా తెలియజేస్తారు. 9నెలలు నిండగా(ఎల్ఎంపీఈడీ) పుస్తకంలో ఎంట్రీ చేయిస్తారు. 9వ నెల మొదటివారంలో గర్భిణి ప్రసవ తేదీని కుటుంబీకులకు వివరించి అక్కడ నుంచి ప్రతిరోజూ గర్భిణి ఇంటి మనిషిగా నిత్యం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటారు. నొప్పులు వచ్చిన వెంటనే 102 వాహనంలో ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్తారు. అంతేకాకుండా, ప్రసవం తర్వాత బీపీ హెచ్చుతగ్గులను పరిశీలించి పుట్టినబిడ్డకు గంటలోపు ముర్రుపాలు పట్టిస్తారు. అక్కడి నుంచి తల్లీబిడ్డల సంరక్షణలో భాగంగా పుట్టినబిడ్డ కలర్, బాలింతకు బ్లడ్ బ్లీడింగ్ వంటి కార్యక్రమాలు చేపడతారు. ప్రసవమైన తల్లులను మూడురోజులకు తిరిగి అమ్మఒడి వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చుతారు. ప్రసవం పొందిన మహిళలను 3, 4, 7, 14, 21, 28, 42 రోజుల్లో వారి ఇంటికి వెళ్లి తల్లీబిడ్డ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్నారు. పుట్టినబిడ్డకు 16నెలల వయస్సు వచ్చాక డీపీటీ బూస్టర్ ఇంజక్షన్తోపాటు చుక్కల మందును వేస్తారు. బిడ్డకు ధనుర్వాతం, మెదడువాపు, తెల్లమచ్చలు వంటివి రాకుండా నివారణ చర్యలు చేపడతారు. బిడ్డ సంరక్షణలో భాగంగా చిన్నప్పటి హెపటైటిస్-బీ చుక్కల మందు కామెర్ల నివారణ కోసం వేయిస్తారు. ఓపీవీ, ఐపీవీ వేయించి ఓరల్వాయిల్ పోలియో చుక్కలను సైతం అందిస్తారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆశ కార్యకర్తలకు రూ.1800 మాత్రమే నామమాత్రపు పారితోషకం ఉండగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వారి సేవలను గుర్తించి రూ.9,750 పారితోషకాన్ని అందిస్తున్నారు. రాష్ట్రంలో 27వేల మంది ఆశ కార్యకర్తలు ఉండగా ఖమ్మం జిల్లాలో 1,353 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఆశ కార్యకర్తలు మెరుగైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో వారందరికీ ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లను సైతం అందించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆశలకు మరింత గుర్తింపు దక్కింది.
వ్యాధి నివారణలోనూ ముఖ్యపాత్ర
ప్రభుత్వం చేపడుతున్న పలు వ్యాధి నివారణ కార్యక్రమాల్లో ఆశ కార్యకర్తలు చురుగ్గా పాల్గొంటున్నారు. జాతీయ వెక్టర్ బర్న్ డిసీజ్ కంట్రోల్, టీబీ నియంత్రణ కార్యక్రమం, జాతీయ లెప్రసీ నివారణ, ఎయిడ్స్ నియంత్రణ, అంధత్వ నియంత్రణ, మానసిక ఆరోగ్యం, వృద్ధుల ఆరోగ్య సంరక్షణ, క్యాన్సర్ డయాబెటీస్, కార్డియా వాస్కులర్, ఇంటిగ్రేటెడ్ డిసీజెస్, చెవుడు నివారణ, కూల్ హెల్త్, యూనివర్సల్ ఇమ్యూనైజేషన్, అయోడిన్ లోపం, పొగాకు నియంత్రణ వంటి కార్యక్రమాల్లో ఆశ కార్యకర్తలు పాల్గొంటున్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఎన్సీడీ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో దీర్ఘకాలిక వ్యాధుల రోగులను గుర్తించి వారికి అవసరమైన ఎన్సీడీ కిట్లను ఇంటింటికి తిరిగి పంపిణీ చేస్తున్నారు. గర్భిణుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన న్యూట్రిషన్ కిట్లను సైతం అందిస్తున్నారు.
మెరుగైన సేవలు అందిస్తాం..
ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం చేపట్టిన అన్ని కార్యక్రమాల్లో భాగస్వాములమై మెరుగైన సేవలు అందిస్తాం. ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ తమ సేవలను గుర్తించి స్థిరవేతనం కల్పించాలి. పీఎఫ్, ఈఎస్ఐ, హెల్త్కార్డుల సౌకర్యం కల్పించాలి. జిల్లావ్యాప్తంగా ఉన్న ఆశ కార్యకర్తలం అంకితభావంతో పనిచేస్తూ ప్రభుత్వ ఆశయాన్ని నెరవేరుస్తున్నాం.
– పత్తేపరపు కరుణ, ఆశ కార్యకర్త, టీఆర్ఎస్కేవీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు, ఖమ్మం
ప్రజాసేవలో తృప్తి ఉంది..
గర్భిణులు, బాలింతలకు శక్తివంచన లేకుండా సేవ చేసేందుకు కృషి చేస్తున్నాం. ప్రభుత్వం అప్పగించిన పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేసి ప్రజారోగ్యంపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి ఇంటికెళ్లి గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు వారికి అవసరమైన టీకాలు, మందులు వేసుకునేలా అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలకు సేవ చేస్తుంటే తృప్తిగా ఉంది.
– బండి అనసూర్య, ఆశ కార్యకర్త,
తాళ్లపెంట, పెనుబల్లి మండలం