సత్తుపల్లి టౌన్, మే 27 : రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాల ఫలాలను పేదలకు అందిస్తూ తెలంగాణ ప్రభుత్వం ముందుకుపోతున్నదని, ఒక్క సత్తుపల్లి నియోజకవర్గంలోనే గడిచిన మూడేళ్లలో రూ.1000 కోట్ల అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం సత్తుపల్లి పట్టణంలో జరిగిన సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సత్తుపల్లి నియోజకవర్గానికి ఇప్పటివరకు అడిగినవన్నీ సీఎం కేసీఆర్ మంజూరు చేశారని, ఇటువంటి ముఖ్యమంత్రి ఉండడం మన అదృష్టమన్నారు.
145 మంది లబ్ధిదారులకు రూ.73 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన ఈ సందర్భంగా పంపిణీ చేశారు. ఆపదలో ఆదుకున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించడం ప్రతిఒక్కరి నైతిక బాధ్యతని ఎమ్మెల్యే గుర్తుచేశారు. సీఎంఆర్ఎఫ్పై విమర్శించే వారు గత ప్రభుత్వాల్లో ఎందుకు సాయం అందించలేకపోయారో చెప్పాలన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ నుంచి నాలుగేళ్లలో 4,612 మందికి రూ.25.66 కోట్ల సాయం అందిందన్నారు. ఇల్లులేని నిరుపేదలను గుర్తించి ఇళ్లస్థలాలు అందించేందుకు ఇప్పటికే రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలాలను గుర్తించారని, పట్టాలను త్వరలో పంపిణీ చేస్తామన్నారు. అదేవిధంగా పోడుభూముల పట్టాలను కూడా అందించనున్నట్లు తెలిపారు.
ప్రతిఒక్క కార్యకర్త గ్రామగ్రామాన జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల సంగ్రా మం మొదలైందని, అభివృద్ధి పథకాలను విస్తృతంగా ప్రచా రం చేయాలని చెప్పారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, ఆత్మ చైర్మన్ వనమా వాసు, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు యాగంటి శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు రఫీ, కౌన్సిలర్లు గ్రాండ్ మౌలాలి, మట్టా ప్రసాద్, అంకమరాజు, పెనుబల్లి ఎంపీపీ లక్కినేని అలేఖ్య, సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, వేంసూరు మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.