రామవరం, జూలై 3 : కొత్తగూడెం ఏరియా 2022-23 ఆర్థిక సంవత్సరం జూన్ నెలకు ఏరియాకు నిర్దేశించిన 10.58 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 10.59 లక్షల టన్నులు ఉత్పత్తిచేసి వందశాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించిందని ఏరియా జనరల్ మేనేజర్ చిలుకూరి నర్సింహారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ వరకు 34.54 లక్షల టన్నులకు గాను 29.66 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిచేసి 86 శాతం ఉత్పత్తి సాధించామని జూన్ నెలలో రోడ్డు, రైల్ద్వారా 10.82 లక్షల టన్నుల బొగ్గు రవాణ జరిగిందని తెలిపారు.
జేవీఆర్ ఓసీలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
సత్తుపల్లి టౌన్, జూలై 3 : సత్తుపల్లి ప్రాంతంలో విస్తరించి ఉన్న సింగరేణి ఓపెన్కాస్ట్లో శనివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో ఉత్పత్తికి ఆటంకం ఏర్పడినట్లు సింగరేణి పీవో వెంకటాచారి తెలిపారు. ప్రతిరోజూ 10వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుందని, వర్షం కారణంగా ఆటంకం ఏర్పడడంతో పాటు 40వేల టన్నుల మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయన్నారు. వర్షం యథావిధిగా కొనసాగితే ప్రతిరోజూ ఉత్పత్తికి నష్టం జరుగుతుందని చెప్పారు. వర్షం కారణంగా బొగ్గుగనుల్లో నీరు చేరడంతో నష్టం వాటిల్లిందని, ఈ వర్షం తగ్గిన తర్వాత నీటిని బయటకు తీసి ఉత్పత్తి పనులు చేపడుతామని తెలిపారు.