సారపాక/ అశ్వాపురం/ మణుగూరు టౌన్/ పినపాక/ కరకగూడెం, నవంబర్ 27: ఏజెన్సీ ప్రాం తంలో ఉన్న పినపాక నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.100 కోట్ల నిధులు మంజూరు చేశారు. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా టీ(బీ)ఆర్ఎస్ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి. కృతజ్ఞతగా అన్ని మండలాల్లోనూ పార్టీ శ్రేణులు సీఎం కేసీఆర్, ప్రభుత్వ విప్ రేగా ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మంజూరు చేసినఈ నిధులతో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇదే క్రమంలో నియోజకవర్గంలో కూడా రానున్న రోజుల్లో పార్టీ మరింత బలోపేతమై తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని స్పష్టం చేశారు.
ప్రభుత్వ విప్ రేగా కాంతారావు విధేయత, విశ్వసనీయతతోనే ఈ నిధులు మంజూరైనట్లు వివరించారు. బూర్గంపహాడ్ మం డలం సారపాక సెంటర్, అశ్వాపురం మండల కేంద్రం, మణుగూరు మండల టీఆర్ఎస్ కార్యాలయం, పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం క్రాస్రోడ్డు, కరకగూడెం మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు కలిసి సీఎం కేసీఆర్, ప్రభుత్వ విప్ రేగా ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు చేశారు. ఏడూళ్లబయ్యారం క్రాస్రోడ్డులో పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు.