అధికారులు సమన్వయంతో పనిచేయాలి
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కొనుగోలు చేపట్టాలి
ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్
వ్యవసాయ, పౌరసరఫరాలు, మార్క్ఫెడ్, మార్కెటింగ్, సహకార శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం
ఖమ్మం, ఏప్రిల్ 9 : యాసంగిలో పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని వ్యవసాయ, పౌరసరఫరాలు, మార్క్ఫెడ్, మార్కెటింగ్, సహకార శాఖల అధికారులను ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వీ ఆదేశించారు. శుక్రవారం భక్తరామదాసు కళాక్షేత్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు, ముఖ్య కార్యనిర్వహణాధికారులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతుల నుంచి వరిపంటను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రైతులు తమ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తేమ శాతాన్ని నిర్ధేచించుకొని, శుభ్రపరిచి కనీస మద్దతు ధర పొందేలా రైతులను చైతన్యవంతం చేయాలన్నారు. ఈ సీజన్లో ఏ గ్రేడ్ ధాన్యం రూ.1880, కామన్ ముతక రకం రూ.1868 క్వింటాల్కు చెల్లిస్తామన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసి డబ్బులను నేరుగా వారి బ్యాంక్ ఖాతాలకు జమ చేయడం జరుగుతుందన్నారు.
మధ్యవర్తులకు మద్దతు ధర కంటే తక్కువగా విక్రయించి మోసపోకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనలు పాటించాలని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పడు మిల్లులకు తరలించాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రవాణాకు వాహనాలను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అధికారులందరూ సమన్వయంతో విధులను నిర్వర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎస్.మధుసూదన్రావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి విజయనిర్మల, జిల్లా సహకార అధికారి విజయకుమారి, ఏడి.శ్రీనివాసరావు, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ సునీత, జిల్లా పౌరసంబంధాల శాఖాధికారి రాజేంద్రప్రసాద్, మేనేజర్ సోములు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బొమ్మా రాజేశ్వరరావు, సహకార పనపతి సంఘం సభ్యులు
తదితరులు పాల్గొన్నారు.