పోడు సాగుచేస్తున్న రైతులకు పకడ్బందీగా పట్టాల పంపిణీ
రేలకాయలపల్లి గ్రామసభలో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్
కారేపల్లి, నవంబర్ 8: అర్హులైన పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. మండలంలోని రేలకాయలపల్లి, చీమలపాడు పంచాయతీ కార్యాలయాల్లో సోమవారం జరిగిన పోడు భూముల దరఖాస్తుల స్వీకరణ గ్రామసభకు ఆయన హాజరై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అటవీహక్కు చట్టం ప్రకారం అటవీ భూముల్లో సాగు చేస్తున్న షెడ్యూల్డ్ తెగలు, ఇతర సామాజిక వర్గాల ప్రజలకు అటవీహక్కు పత్రాలను అందజేసి శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించినట్లు చెప్పారు. దరఖాస్తును, భూమిని క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత గ్రామసభ తీర్మానంతో సబ్ డివిజన్, జిల్లా స్థాయి కమిటీల ద్వారా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ హక్కు పత్రాలు ఇచ్చి న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి అజయ్కుమార్, తహసీల్దార్ కే.రవికుమార్, ఎంపీడీవో కే.జమలారెడ్డి, రేలకాయలపల్లి, చీమలపాడు సర్పంచ్లు భూక్యా రమణ, మాలోత్ కిశోర్, పంచాయతీ కార్యదర్శులు వెంకట్, భాస్కర్, అటవీశాఖ అధికారులు సాంబశివరావు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.