కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించిన ఎన్నికల అధికారి
హాజరైన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ నామా, నూకల నరేశ్రెడ్డి
జూమ్ యాప్ ద్వారా కార్యక్రమాన్ని వీక్షించిన మంత్రి అజయ్
ఖమ్మం, మే 7 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): ఉత్కంఠకు తెర పడింది.. మేయర్ ఎవరో తేలిపోయింది. ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన టీఆర్ఎస్.. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కైవసం చేసుకున్నది. నగర మేయర్గా పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్గా ఫాతిమా జోహారా ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో అదనపు కలెక్టర్ మధుసూదన్ అధ్యక్షతన నిర్వహించిన ఎన్నికల్లో వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసిన పేర్లతో కూడిన సీల్డ్ కవర్ను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్రెడ్డి టీఆర్ఎస్ తరుఫున ఎన్నికల అధికారులకు సమర్పించారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు మహిళలను వరించడం ఇదే తొలిసారి. తొలుత కార్పొరేటర్లతో ఎన్నికల అధికారి పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. కొవిడ్ కారణంగా హాజరుకానివారు వీడియో కాల్ ద్వారా ప్రమాణ స్వీకారం చేశారు. ఎక్స్అఫీషియో సభ్యుడి హోదాలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ జూమ్ యాప్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.
నగరపాలక సంస్థ తొలి మహిళా మేయర్గా పునుకొల్లు నీరజ, తొలి మహిళా డిప్యూటీ మేయర్గా ఫాతిమా జోహారా ఎన్నికయ్యారు. శుక్రవారం నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన ఎన్నికలో వీరు ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ సహాయ సహకారాలతో మంత్రి అజయ్కుమార్ నేతృత్వంలో కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ తిరుగులేని విజయం సాధించి రెండు పదవులనూ కైవసం చేసుకున్నది. అధిష్ఠానం ఖరారు చేసిన పేర్లతో కూడిన సీల్డ్ కవర్తో రాష్ట్ర రహదారులు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్రెడ్డి ఎన్నికకు హాజరయ్యారు. అధిష్ఠానం సూచించిన పేర్లతో ఉన్న ఫాం ఏ, ఫాం-బీలను మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల కోసం పార్టీ తరఫున అధికారులకు సమర్పించారు.
ఎన్నిక ఏకగ్రీవం..
టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, బీజేపీ, సీపీఎం కార్పొరేటర్లు తమ పార్టీల కండువాలు ధరించి తొలి మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశానికి హాజరయ్యారు. సమావేశానికి అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ అధ్యక్షత వహించి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించారు. మేయర్ పదవికి టీఆర్ఎస్ తరఫున పునుకొల్లు నీరజ పేరును 58వ డివిజన్ కార్పొరేటర్ దోరేపల్లి శ్వేత ప్రతిపాదించగా, 24వ డివిజన్ కార్పొరేటర్ కమర్తపు మురళీ బలపరిచారు. టీఆర్ఎస్ తరఫున
డిప్యూటీ మేయర్గా 37వ డివిజన్ కార్పొరేటర్ ఫాతిమా జోహారా పేరును 25వ డివిజన్ కార్పొరేటర్ గోళ్ల చంద్రకళ ప్రతిపాదించగా 40వ డివిజన్ కార్పొరేటర్ దాదె అమృతమ్మ బలపరిచారు. సమావేశంలో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు టీఆర్ఎస్ తరఫున ఒక్కో నామినేషన్ దాఖలు కావడం, ఇతర పార్టీలు పోటీ చేయకపోవడంతో మేయర్గా పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్గా ఫాతిమా జోహారా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి మధుసూదన్ ప్రకటించారు. మేయర్ పదవితో పాటు డిప్యూటీ మేయర్ పదవీ మహిళలను వరించడంతో టీఆర్ఎస్ శ్రేణుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
‘జూమ్’ యాప్ ద్వారా మంత్రి అజయ్..
తొలుత ఎన్నికైన కార్పొరేటర్లతో ఎన్నికల అధికారి మధుసూదన్ ప్రమాణ స్వీకారం చేయించారు. 1వ వడివిజన్ కార్పొరేటర్ హుస్సేన్, 3వ డివిజన్ కార్పొరేటర్ మలీదు జగన్, 13వ డివిజన్ కార్పొరేటర్ కొత్తపల్లి నీరజ కొవిడ్ కారణంగా వీడియో కాల్ ద్వారా ప్రమాణ స్వీకారం చేశారు. ఖమ్మం నగరపాలక సంస్థ ఎక్స్అఫీషియో సభ్యుడి హోదాలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ జూమ్ యాప్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. మేయర్గా పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్గా ఫాతిమా జోహారా ప్రమాణం చేశారు. వీరికి రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, అడిషనల్ కలెక్టర్, ఎన్నికల అధికారి మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్జయంతి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు మేయర్ నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారాకు పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఎన్నిక ప్రక్రియ నేపథ్యంలో పోలీసులు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.