ఖమ్మం కల్చరల్/ మామిళ్లగూడెం/ రఘునాథపాలెం, సెప్టెంబర్ 19: సంప్రదాయ వస్త్రధారణలతో నృత్యాలు.. విచిత్ర వేషధారణలు.. డప్పు నృత్యాలు.. రంగుల కేళీల ఉత్సాహంతో భక్తులు గణనాథుడిని అనుసరించగా నిమజ్జన శోభాయాత్ర కనులపండువగా సాగింది. విగ్రహాలను వాహనాలపై పలు రూట్ల నుంచి గాంధీచౌక్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్దకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి విగ్రహాలు నగరంలో శోభాయాత్ర కనుల పండువగా సాగింది. శోభాయాత్ర ముందు భాగంలో భక్త బృందాల కోలాటాలు, డప్పు నృత్యాలు, విచిత్ర వేషధారణలు ఆకట్టుకున్నాయి.
వైభవంగా గణేశ్ ఉత్సవం..
కరోనాతో రెండేళ్లుగా సామూహిక ఉత్సవానికి నోచుకోని వినాయక నవరాత్రి వేడుకలు ఈ సంవత్సరం పూర్వ వైభవం సంతరించుకున్నాయి. ఖమ్మం గాంధీచౌక్ వద్ద స్తంభాద్రి ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన సార్వజనిక గణేశ్ నిమజ్జన వీడ్కోలు బహిరంగ సభ గతంలో మాదిరిగా ఘనంగా జరిగింది. సభ వద్ద ఖమ్మంలో గణేశ్ నిమజ్జన వీడ్కోలు, శోభాయాత్ర సభలో మంత్రి అజయ్కుమార్, కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్, మేయర్ నీరజ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. శాస్ర్తోక్తంగా విగ్రహాలపై పూలు చల్లి నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్ మాట్లాడుతూ గణనాథుడి కృపతో కరోనా పూర్తి స్థాయిలో తొలగిపోతుందని అన్నారు. ఖమ్మంలోని విగ్రహాలను కాల్వొడ్డు, ప్రకాశ్నగర్ చప్టాల వద్ద మున్నేరులో నిమజ్జనం చేశారు. ఈ నిమజ్జనోత్సవం నేత్రపర్వంగా సాగింది.
180 సీసీ కెమెరాలతో పర్యవేక్షణ
గణేశ్ నిమజ్జనం కోసం పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. శోభాయాత్ర, నిమజ్జనం వేడుకలను కలెక్టర్ గౌతమ్తో కలిసి సీపీ విష్ణు వారియర్ పర్యవేక్షించారు. దాదాపు 80 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. శోభాయాత్రను 180 సీసీ కెమెరాలతో పర్యవేక్షించారు.