మామిళ్లగూడెం, డిసెంబర్ 6: వసతి గృహాల్లో మెనూను కచ్చితంగా పాటిస్తూ విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. నగరంలోని పోస్టుమెట్రిక్ గిరిజన బాలుర కళాశాల వసతిగృహాన్ని సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగది, భోజనశాల, తాగునీటి సౌకర్యం, విద్యార్థుల వసతి గదులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ వసతి ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వార్డెన్, వంట మనుషులకు కలెక్టర్ పలు ఆదేశాలు చేశారు. వంటలకు గ్యాస్ సిలెండర్లను వినియోగించాలని, కట్టెల వాడకాన్ని పూర్తిగా నివారించాలని సూచించారు. విద్యార్థులకు కళాశాల సమయానికంటే ముందే అల్పాహారం, మధ్యాహ్న భోజనం సిద్ధం చేసి అందించాలన్నారు. విద్యార్థులకు అసౌకర్యం లేకుండా వసతులన్నీ సమకూర్చాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు. అనంతరం హాస్టల్ పకనే నిర్మాణ పనులు పురోగతిలో ఉన్న గిరిజన సంక్షేమ భవనాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. నెలాఖరులోగా ముగింపు పనులను పూర్తి చేయకుంటే బాధ్యులపై చర్యలుంటాయని స్పష్టం చేశారు. డీటీడబ్ల్యూవో కృష్ణనాయక్, ఏటీడీవో తిరుమలరావు, వార్డెన్ భారతి, డీఈఈ రాజు, ఏఈఈ మూర్తి పాల్గొన్నారు.