ఖమ్మం, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎన్నిక ఏదైనా విజయం తమదేనన్న స్థాయిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలంగా వేళ్లూనుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్).. సంస్థాగత నిర్మాణం పై దృష్టి సారించింది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే అత్యంత పెద్ద పార్టీగా అవతరించి ప్రజల తలలో నాలుకలా వ్యవహరిస్తోంది. ఇప్పుడిక వార్డు స్థాయి నుంచి గ్రామ, మండల, జిల్లా స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది. పార్టీని నమ్ముకొని దాని బలోపేతం కోసం నిరంతరం శ్రమిస్తున్న కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలన్న లక్ష్యంతో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎన్నికలు నిర్వహించి కమిటీలను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణను రూపొందించింది. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నేతృత్వంలో ఉమ్మడి జిల్లాలో ఆయా నియోజకవర్గాల అధికార పార్టీ శాసనసభ్యులు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జులుగా పార్టీ సంస్థాగత నిర్మాణంలో నిమగ్నమయ్యారు. ఉద్యమాల గుమ్మంగా ఉన్న ఉమ్మడి ఖమ్మంలో టీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడంతో కార్యకర్తల్లో జోష్ నెలకొంది. సెప్టెంబర్ 2న జెండా పండుగతో ప్రారంభమయ్యే సంస్థాగత సందడి నెల చివరి వరకు కొనసాగనుంది. పార్టీ కమిటీలతోపాటు అనుబంధ సంఘాల కమిటీలను సైతం ఏర్పాటు చేయాలని పార్టీ నిర్ణయించింది.
గ్రామ, మండల ,పట్టణ, నగర, డివిజన్ స్థాయిల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయి కార్యవర్గాలు ఏర్పడిన వెంటనే జిల్లా కమిటీ ఏర్పాటు కానుంది. అధ్యక్షుడితోపాటు 25 మందితో జిల్లా కమిటీ ఏర్పాటు కానుంది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఇప్పటికే సంస్థాగత సందడి ప్రారంభమైంది. గ్రామ, మండల కమిటీలను ఎన్నుకునేందుకు శాసనసభ్యులు సంబంధిత ఇన్చార్జులు, మండల, గ్రామ శ్రేణులతో ఇప్పటికే సన్నాహక సమావేశాలు నిర్వహించారు. జెండా పండుగ ప్రాధాన్యాన్ని క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు తెలియజేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు పార్టీ శ్రేణులు సమాయాత్తమవుతున్నాయి. పార్టీ సంస్థాగత నిర్మాణంలో అన్ని వర్గాల వారికి ప్రాధాన్యం ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. సెప్టెంబర్ 2న ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఉండడంతో జిల్లా నుంచి మంత్రి పువ్వాడ అజయ్కుమార్, పార్టీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. అనంతరం రెండో తేదీ నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించేందుకు ఆయా నియోజకవర్గాలకు చేరుకోనున్నారు. ఈ నెల 2 నుంచి 12 వరకు వార్డు, గ్రామ, కమిటీల నిర్మాణం పూర్తి కానుంది. 12 నుంచి 20 వరకు మండల కమిటీల నిర్మాణం పూర్తి చేయనున్నారు. 20 నుంచి 30 వరకు జిల్లా కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష పదవులను ఆయా పలువురు నేతలు ఆశిస్తున్నారు. అనుబంధ సంఘాల పదవులకు సైతం పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. పార్టీ సంస్థాగత పక్రియను పరిశీలించేందుకు ఇన్చార్జులను నియమించనున్నట్టు తెలుస్తోంది.
60 లక్షలకుపైగా టీఆర్ఎస్సైన్యం సిద్ధం
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ జెండా పండుగను విజయవంతం చేయాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కార్పొరేషన్, మున్సిపాలిటీ, పట్టణాలు, గ్రామాలు, వార్డుల్లో పార్టీ జెండాను ఎగురవేయాలి. పార్టీ సంస్థాగత నిర్మాణంలో అణగారినవర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలన్న విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు. గులాబీ పార్టీ సభ్యత్వమే ఒక గౌరవం. టీఆర్ఎస్లోకి వస్తే తల్లిఒడిలో సేదతీరిన అనుభూతి కలుగుతుంది. ఆత్మగౌరవాన్ని రెపరెపలాడించిన గులాబీ జెండాకు 60 లక్షలకుపైగా టీఆర్ఎస్ సైన్యం పండుగ చేస్తున్నది. ఈ జెండా పండుగలో అందరూ భాగస్వాములు కావాలి.
ఏడేళ్లు చేసిన అభివృద్ధిని..ప్రజలకు వివరించే పండుగ:ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు
ఖమ్మం, ఆగస్టు 31: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జెండా పండుగను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పిలుపినిచ్చారు. టీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి సంస్థాగతంగా బలోపేతం చేయడంపై అధిష్ఠానం దృష్టి పెట్టిందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఈ జెండా పండుగ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏడేళ్లలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించేదే జెండా పండుగ అని, క్షేత్రస్థాయిలో ప్రచారం చేసే బాధ్యత కార్యకర్తలదేనని అన్నారు. కష్టపడి పనిచేసే వారికి తప్పనిసరిగా గుర్తింపు ఉంటుందన్నారు. 2న జరుగనున్న జెండా పండుగను ప్రతి ఇంట్లో, ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
వాడవాడలా గులాబీ జెండా ఎగురాలె..: టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్రావు
వాడవాడలా గులాబీ జెండా ఎగురాలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్రావు పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక బస్టాండ్ సెంటర్లోని టీబీజీకేఎస్ కార్యాలయం ఆవరణలో బూత్ కమిటీ, వార్డు కమిటీ, గ్రామ కమిటీ, మండల, పట్టణ, అనుబంధ సంఘాల కమిటీల ఎన్నికలపై నిర్వహించిన సమావేశంలో రాఘవేందర్రావు మాట్లాడారు. సీఎం కేసీఆర్ సూచనలతో టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు సైనికుల్లా సిద్ధమవ్వాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు కాసుల వెంకట్, ఆళ్ల మురళి, తూము చౌదరి, మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు తదితరులు పాల్గొన్నారు.