రైతుల నుంచి అభిప్రాయ సేకరణ
పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చేందుకు సర్వే
ప్రభుత్వానికి నివేదించనున్న వ్యవసాయశాఖ
ఖమ్మం, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వానకాలంలో రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్లకు సర్కార్ కసరత్తు ప్రారంభించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా వ్యవసాయశాఖ అధికారులు ఈ మేరకు సర్వే పూర్తి చేశారు. పంట దిగుబడి, విక్రయాలపై రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఈ సీజన్లో జిల్లావ్యాప్తంగా రైతులు ఎన్ని ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు.. ఎంత దిగుబడిని ప్రైవేటు వ్యాపారులకు విక్రయించే అవకాశం ఉన్నది.. ఎంత ధాన్యాన్ని విత్తనాల కోసం నిల్వ చేసుకోనున్నారు.. సన్న రకం, దొడ్డు రకాలు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు.. అనే అంశాలపై వివరాలు తీసుకున్నారు. ఈసారి విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో అధిక దిగుబడులు వస్తాయని రైతులు ఆశిస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో గణాంకాలు ఇలా..
ఏటా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు విముఖత చూపుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే రైతులకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలన్న సంకల్పంతో వ్యవసాయశాఖ అధికారులతో సర్వే చేయించింది. ఖమ్మం జిల్లాలో ఈ సీజన్లో 2.93 లక్షల ఎకరాల్లో వరి సాగవుతున్నది. పంట ద్వారా ఈ సారి 7,09,182 క్వింటాళ్ల ధాన్యం పండుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. దీనిలో రైతులు 1,62,835 క్వింటాళ్ల ధాన్యాన్ని వారి ఆహార అవసరాల కోసం నిల్వ చేసుకోనున్నారు. 1,90,474 క్వింటాళ్ల ధాన్యాన్ని వ్యాపారులు కొనుగోలు చేసే అవకాశం ఉందని 3,55,871 క్వింటాళ్ల ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ అధికారులు గత నెల 30వ తేదీ వరకు నిర్వహించిన సర్వేలో గుర్తించారు. ఈ సమాచారాన్ని ప్రభుత్వానికి నివేదిక రూపంలో సమర్పించనున్నారు. నవంబర్ మొదటివారం నుంచి జనవరి చివరి వరకు ధాన్యం కొనుగోళ్లు జరిగే అవకాశాలు ఉన్నాయి.
కొత్తగూడెం జిల్లాలో ఇలా..
భదాద్రి కొత్తగూడెం జిల్లాలో 69,428 మంది రైతులు వానకాలంలో 1,75,799 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేస్తున్నారు. వ్యవసాయశాఖ అధికారులు పంటల ద్వారా 32,91,128 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసింది. దీనిలో రైతులు ఆహార అవసరాలకు 2,95,647 క్వింటాళ్లు, విత్తన అవసరాలకు 3,380 క్వింటాళ్లు.. పోగా 29,92,102 మిగిలిన ధాన్యాన్ని విక్రయిస్తారని గుర్తించింది.
ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం..
ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించాం. వారం ఎంత ధాన్యాన్ని ఆహార అవసరాల కోసం నిల్వ చేసుకోనున్నారు? ఎంత మొత్తంలో విక్రయించనున్నారు ? విత్తన ధాన్యం కోసం ఎంత నిల్వ చేస్తున్నారు? అనే అంశాలను పరిగణలోకి తీసుకుని నివేదికలు రూపొందించాం. వాటిని ప్రభుత్వానికి నివేదిస్తాం.
-విజయనిర్మల, డీఈఏ, ఖమ్మం