చింతకాని, సెప్టెంబర్ 20: ప్రతి దళితవాడ బంగారు మేడ కావాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. మండలంలో చిన్నమండవ, జగన్నాథపురం తదితర గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు సోమవారం ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. చిన్నమండవ గ్రామంలో రూ.74 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం టీఆర్ఎస్ జెండా ఆవిష్కరించారు. జగన్నాథపురంలో నూతనంగా నిర్మించిన రైతువేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధిర ఎమ్మెల్యే భట్టి చెబితే పథకాలు అందించే స్థితిలో టీఆర్ఎస్ ప్రభుత్వం లేదని, దళితుల అభ్యున్నతి కోసమే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని స్పష్టం చేశారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా చింతకాని మండలంలో పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. దళితులు స్వచ్ఛందంగానే టీఆర్ఎస్లో చేరుతున్నారని, అంతేగానీ దళితబంధు పథకం ఏ ఒక్క రాజకీయ పార్టీకో చెందినదని కాదని అన్నారు. అన్ని పార్టీల్లోని నిరుపేదలకూ దళితబంధు వర్తిస్తుందని స్పష్టం చేశారు. దళితబంధు ద్వారా చింతకాని మండలంలోని సుమారు 5 వేల మందికి లబ్ధి చేకూరనుందని, దళితబంధు అమలు ద్వారా తన రాజకీయ జీవితం ధన్యమైందని అన్నారు.
మరియమ్మ ఘటన ద్వారానే దళితబంధు వచ్చినట్లు స్థానిక ఎమ్మెల్యే భట్టి చెప్పుకొని గ్రామాల్లో తిరుగుతుండడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. అనంతరం జడ్పీటీసీ కిశోర్, సర్పంచ్ వెంకట్రావమ్మ, ఉప సర్పంచ్ వీరబాబు, సొసైటీ డైరెక్టర్ లక్ష్మణ్ అధ్వర్యంలో గ్రామంలో పలు పార్టీలకు చెందిన 30 కుటుంబాలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరాయి. అంతకుముందు సుమారు 50 ట్రాక్టర్లు, 100 కార్లు, 300 బైకులతో గాంధీనగర్ నుంచి చిన్నమండవ వరకు ర్యాలీ నిర్వహించి మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, టీఎస్ సీడ్స్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ శేషగిరిరావు, రైతుబంధుసమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వర్లు, బొమ్మెర రామ్మూర్తి, ఎంపీపీ పూర్ణయ్య, టీఆర్ఎస్ నేతలు పుల్లయ్య, కోటేశ్వరరావు, మనోహర్, హనుమంతరావు, రమేశ్, కుటుంబరావు, నాగయ్య, వెంకటలచ్చయ్య, వెంకటేశ్వర్లు, ప్రసాద్, వెంకట్రామారావు, రామారావు, నర్సయ్య, సర్పంచ్లు పాల్గొన్నారు.